ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే.. తేల్చేసిన ఆసిస్ మాజీ క్రికెటర్

by Harish |
ఐపీఎల్ టైటిల్ ఆ జట్టుదే.. తేల్చేసిన ఆసిస్ మాజీ క్రికెటర్
X

దిశ, స్పోర్ట్స్ : కాసేపట్లో ఐపీఎల్-17 మహా సమరం మొదలుకానుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కోసం తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. బలాబలాల పరంగా ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తుండటంతో ఏ జట్టు గెలుస్తుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. మ్యాచ్ మరి కాసేపట్లో ప్రారంభకానుండగా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ ఫైనల్‌లో గెలిచేదెవరో తన అంచనాను బయటపెట్టాడు.

జియో సినిమాతో వాట్సన్ మాట్లాడుతూ.. కోల్‌కతా టైటిల్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. హైదరాబాద్‌కు కూడా అవకాశం ఉన్నా తన ఫేవరెట్ మాత్రం కేకేఆర్ అని తెలిపాడు. ‘సన్‌రైజర్స్‌కు అవకాశం ఉంది. ఎందుకంటే, పిచ్ ఎలా సహకరిస్తుందో వాళ్లకు తెలుసు. ముఖ్యంగా మంచు లేనప్పుడు. కానీ, నా దృష్టిలో కేకేఆర్ ఫేవరెట్. వాళ్లు ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు. ఆ జట్టులో వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్నారు. వాళ్లను ఓడించడం చాలా కష్టం.’ అని వాట్సన్ అభిప్రాయపడ్డాడు.

ఫైనల్‌లో గెలిస్తే కోల్‌కతా ఖాతాలో మూడో ఐపీఎల్ టైటిల్ చేరనుంది. గతంలో ఆ జట్టు రెండుసార్లు ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. గౌతమ్ గంభీర్ సారథ్యంలో 2012, 2014 సీజన్లలో టైటిల్ సాధించింది. అనంతరం ఆ జట్టు మరోసారి విజేతగా నిలువలేకపోయింది. ఈ సారి శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో అదరగొట్టిన ఆ జట్టు లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచింది. క్వాలిఫయర్-1లో హైదరాబాద్‌ను ఓడించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ను రెండుసార్లు ఓడించడం కేకేఆర్ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. మరి, ఫైనల్‌లో కోల్‌కతా ఏం చేస్తుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed