మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..

by Sumithra |
మామతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కట్టుకున్న భర్తను మామతో కలిసి భార్య హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. హత్య చేయడమే కాకుండా ఇంటి పక్కన గుంత తీసి పూడ్చిపెట్టిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం తిర్మలాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. కొద్ది రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాన్సువాడ సీఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. తిర్మలాపూర్‌కు చెందిన రాములు (33) జులాయిగా తిరుగుతుండేవాడు. తాగి వచ్చి భార్య మంజుల, తండ్రి నారాయణను కొడుతూ హింసించేవాడు. దీంతో విసిగిపోయిన వారిద్దరు కలిసి ఈ నెల 9న రాములును హత్య చేశారు.

మృతదేహాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోని సెప్టిక్‌ ట్యాంకులో ఉంచారు. అనంతరం ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. గత పది రోజులుగా రాములు కనిపించకపోవడం.. ఇంటి పక్కన ఖాళీ స్థలంలో తవ్విన గుంత అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు వారిద్దరిని నిలదీశారు. దీంతో నిందితులిద్దరూ రాములును హత్య చేసినట్లు చెప్పడంతో శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాన్సువాడ పోలీసులు ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని గుంతను తవ్వగా మృతదేహాన్ని గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story