ICC World Cup 2023: పాక్ టీం చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

by Vinod kumar |   ( Updated:2023-10-13 08:22:37.0  )
ICC World Cup 2023: పాక్ టీం చేసిన పనికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా హైదరాబాద్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లు చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఓ ఫోటోను తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జట్టు ఆటగాళ్లను అభినందించింది. పాక్ ఫ్యాన్స్ కూడా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శ్రీలంకతో జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ప్రపంచకప్‌లో తమ రెండో విజయాన్ని నమోదు చేయగా.. ఈ రెండు మ్యాచ్‌లూ హైదరాబాద్‌లోనే జరగడం, ఆ మ్యాచ్‌లలో పాకిస్తాన్ గెలవడంతో ఉప్పల్ స్టేడియం గ్రౌండ్ స్టాఫ్‌కు పాకిస్తాన్ జట్టు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపింది.

ఈ క్రమంలోనే కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు మిగిలిన ఆటగాళ్లు గ్రౌండ్ స్టాఫ్‌తో కలిసి ఫోటోలు దిగారు. ఇక కెప్టెన్ బాబర్.. వారికి తమ జెర్సీని కూడా గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ కూడా ఎక్స్‌లోపోస్ట్ చేసి ఆటగాళ్లను అభినందించింది. పాకిస్తాన్ జట్టు బుధవారం హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్ బయలుదేరనుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో 14వ తేదీ శనివారం భారత్‌తో తలపడనుంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో వరుస విజయాలు సాధించిన పాకిస్తాన్.. భారత్‌పై కూడా గెలిచి రికార్డ్ సృష్టించాలని పట్టుదలగా ఉంది. అలాగే ఇప్పటివరకు వన్డే వరల్డ్ కప్‌ చరిత్రలో ఒక్కసారి కూడా భారత్‌పై పాకిస్తాన్ గెలవలేదు. ఈ రికార్డును కూడా తిరగరాయాలని పాక్ భావిస్తోంది.

Advertisement

Next Story