చరిత్రలో ఈ రోజు.. ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్

by Anukaran |   ( Updated:2021-04-01 15:17:19.0  )
చరిత్రలో ఈ రోజు.. ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్
X

దిశ, స్పోర్ట్స్ : ‘ధోనీ ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్.. ఏ మాగ్నిఫిషియంట్ స్ట్రైక్ ఇంటూ ద క్రౌడ్. ఇండియా లిఫ్ట్ ది వరల్డ్ కప్ ఆఫ్టర్ 28 ఇయర్స్’.. సరిగ్గా పదేళ్ల క్రితం (2 ఏప్రిల్ 2011) అప్పటి కామెంటేటర్ రవిశాస్త్రి గొంతు చించుకుంటూ చెప్పిన ఈ మాటలు ఇప్పటికీ తాజాగానే చెవుల్లో మార్మోగుతున్నాయి. కపిల్ సేన వరల్డ్ కప్ గెలిపించిన 28 తర్వాత ఎంఎస్ ధోనీ తిరిగి టీమ్ ఇండియాకు వన్డే వరల్డ్ కప్ అందించాడు. సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన సచిన్ టెండుల్కర్ జీవితంలో తొలి సారి వరల్డ్ కప్ అందుకున్న రోజు అది. గౌతమ్ గంభీర్ సెంచరీ మిస్ అయినా.. చివర్లో ధోనీతో కలసి యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్ ఇప్పటికీ తాజా జ్ఞాపకాలుగా కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఆ తర్వాత రెండు వరల్డ్ కప్స్ జరిగినా టీమ్ ఇండియా విజేతగా నిలవలేక పోయింది.

28 ఏళ్ల కల..

టీమ్ ఇండియా తొలి సారిగా కపిల్ దేవ్ నేతృత్వంలో 1983లో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మరో సారి విజేతగా నిలవడానికి 28 ఏళ్లు పట్టింది. ఇండియా-శ్రీలంక-బంగ్లాదేశ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా టోర్నీలో 14 దేశాలు పాల్గొన్నాయి. గ్రూప్‌ ఏలో రెండో స్థానంలో నిలిచిన శ్రీలంక, గ్రూప్ బిలో రెండో స్థానంలో నిలిచిన ఇండియా ఫైనల్స్‌కు చేరడం విశేషం. ఈ ఫైనల్ కంటే ముందే ఫైనల్ లాంటి మ్యాచ్ మొహలీలో జరిగింది. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇంత వరకు ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియాను ఓడించలేకపోయిన పాకిస్తాన్.. ఆ మ్యాచ్‌లో ఓడిపోయింది. ముంబయి లోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ చేసింది. ఆదిలోనే జహీర్ ఖాన్ దెబ్బ కొట్టినా శ్రీలంక తర్వాత కోలుకొని నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. చివరి 10 ఓవర్లలో శ్రీలంక 91 పరుగులు బాదింది.

ఇక టీమ్ ఇండియా ఛేజింగ్‌లో కాస్త తడబడింది. లసిత్ మలింగ రెండో బంతికే సెహ్వాగ్‌ను డకౌట్ చేశాడు. సచిన్ కూడా తక్కువ స్కోర్‌కే అవుటయ్యాడు. అప్పుడు గంభీర్‌తో కలసి కోహ్లీ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయితే 114 పరుగుల వద్ద కోహ్లీ (35) ఔటయ్యాడు. ఆ తర్వాత ధోనీతో కలసి గంభీర్ ఇన్నింగ్స్ నిర్మించాడు. గంభీర్ (97) తృటిలో సెంచరీ కోల్పోయాడు. కానీ ధోనీ మాత్రం శ్రీలంక బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు. చివర్లో యువీతో కలసి అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 11 బంతులకు 4 పరుగులు అవసరమైన సమయంలో కులశేఖర బౌలింగ్‌లో ధోనీ సిక్స్ కొట్టి భారత్‌కు ప్రపంచ కప్ అందించాడు. ఆ మ్యాచ్‌లో 79 బంతులకు 91 పరుగులు చేసిన ధోనీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. యువరాజ్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు.

విశేషాలు..

– వరల్డ్ కప్ గెలిచిన తర్వాత యువ క్రికెటర్లు కోహ్లీ, శ్రీశాంత్‌లతో పాటు ధోనీ కూడా సచిన్‌ను భుజాలపై మోసి సంబరాలు జరిపారు.
– వరల్డ్ కప్ జట్టులో ప్రతీ క్రికెటర్‌కు బీసీసీఐ రూ. 2 కోట్ల రివార్డు అందించింది. సహాయక సిబ్బందికి కూ. 50 లక్షలు, సెలెక్షన్ కమిటీ సభ్యులకు రూ. 25 లక్షలను అందించింది.
– ఎంఎస్ ధోనీకి రూ. 2 కోట్లు, జట్టులోని ఢిల్లీ క్రికెటర్లకు రూ. 1 కోటి చొప్పున ఢిల్లీ ప్రభుత్వం అందించింది.
– ఎంఎస్ ధోనీకి ఫెరారీ కారు, యువరాజ్‌కు ఆడి కార్లను ఆయా కంపెనీలు బహుమతిగా ఇచ్చాయి.
– యూసుఫ్ పఠాన్, మునాఫ్ పటేల్‌లకు గుజరాత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఏకలవ్య అవార్డులు ప్రకటించాయి.

Advertisement

Next Story

Most Viewed