దేశంలో ఒకేరోజు 11458 కేసులు

by vinod kumar |
దేశంలో ఒకేరోజు 11458 కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం ఉదయం బులెటిన్ వెల్లడించే సరికి గడిచిన 24 గంటల్లో ఏకంగా 11,458 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా దేశంలో ప్రవేశించినప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,08,993కు చేరింది. దేశంలో ఒక్కరోజే కరోనాతో 386 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 8884కి చేరింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 1,54,329 మంది కోలుకోగా 1,45,779 మంది ఆస్పత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.

దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకు ఎక్కువవుతోంది. మహారాష్ట్రలో ఒక్కరోజే 3427పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి కరోనా కేసుల సంఖ్య 1,04,568కి చేరింది. అంతేకాకుండా.. ఒక్కరోజే 113 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ముంబైలో శనివారం 1383 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 69 మంది కరోనాతో మరణించారు. ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 56,740కి చేరింది. ముంబైలో ఇప్పటివరకు కరోనాతో 2111 మంది చనిపోవడం బాధకరం.

తమిళనాడులో గడిచిన 24 గంటల్లో 1989 కొత్త కేసులు నమోదవడంతో.. మొత్తం కేసుల సంఖ్య 42,687కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 30 మంది మరణించడంతో.. ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 397కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజులో 2134 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 38,958కు చేరింది. ఢిల్లీలో కరోనా బారిన పడి ఒక్కరోజే 57 మంది మరణించారు. దీంతో ఢిల్లీలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1271కి చేరింది. అటు గుజరాత్‌లో శనివారం 517 కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య23,079కి చేరింది. ఇక్కడ 33 మంది కరోనాతో చనిపోవడంతో.. ఇప్పటివరకు వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1449కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 186 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 4588కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 80 మంది మరణించారు.

Advertisement

Next Story

Most Viewed