పన్ను చెల్లింపు కోసం ఈ-క్యాలిక్యులేటర్!

by Harish |
పన్ను చెల్లింపు కోసం ఈ-క్యాలిక్యులేటర్!
X

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్, పోపుల డబ్బాలో చిల్లర దాచిన చందంగా ఉంది. వంటింట్లోకి వెళ్లి ఏ డబ్బాలో చిల్లర దొరుకుతుందో ఎలాగైతే చెప్పలేమో! నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపన్ను కూడా అదే విధంగా ఉందని పన్ను చెల్లింపుదారులు వాపోతున్నారు. పన్ను భారాన్ని తగ్గించే మినహాయింపులు ఉన్న పాత ఆదాయ పన్ను విధానానికి కట్టుబడి ఉండాలా? ఈ మినహాయింపులన్నీ వద్దనుకుని తక్కు పన్ను రేటు ఉండే కొత్త విధానానికి తలొగ్గాలా?
ఉద్యోగులతో పాటు పన్ను చెల్లించే ప్రతి ఒక్కరికీ ఇది భేతాళ ప్రశ్నే. దీంతో పాటు కొత్త విధానాన్ని ఎంచుకుంటే పాత విధానం మళ్లీ తిరిగి ఎంచుకునే అవకాశం ఉందా? లేదా? అనేది మరో చిక్కు ప్రశ్న. అసలు దీనికి నిపుణులు ఎలాంటి పరిష్కారాన్ని సూచిస్తున్నారో చూద్దాం!

ఇతర ఆదాయాలేమీ లేకుండా జీతం మాత్రమే తీసుకుంటున్నవారికి ఈ విషయంలో ఎలాంటి ఢోకా లేదు. ఎందులో పన్ను భారాన్ని తగ్గించుకునే వీలుందో దాన్ని ఆ సంవత్సరం ఎంపిక చేసుకోవచ్చు. అయితే, బిజినెస్ ద్వారా ఆదాయం ఉన్న వారికి మాత్రం ఈ వెసులుబాటు లేదు. బిజినెస్ ఉన్నవారు ఒకసారి కొత్త విధానంలో చేరితే శాశ్వతంగా అందులోనే కొనసాగాల్సి ఉంటుంది. అయితే, ఈ అంశంలో మరో సందేహం కలగొచ్చు. బిజినెస్ ప్రతి సంవత్సరం ఉండదు కదా..బిజినెస్ లేని ఏడాది ఏం చేయాలి? అని, దానికోసం ఆదాయం లేని సంవత్సరానికి తమకు నచ్చిన, అవకాశం ఉన్న విధానాన్ని ఎంచుకోవచ్చని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

పన్ను చెల్లింపుదారుల కోసం ఆ పన్నులను లెక్కబెట్టేందుకు ఆదాయపు పన్నుల శాఖ ఈ-క్యాలిక్యులేటర్‌ను ప్రారంభించింది. పన్నుల శాఖ ప్రారంభించిన క్యాలిక్యులేటర్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి పాత, కొత్త పన్ను విధానాలలో పన్నులను లెక్కగడుతుంది. ఈ-క్యాలిక్యులేటర్ కోసం https://www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని పన్నుల శాఖ ప్రకటించింది. ఎవరైనా సరే పన్ను చెల్లించేవారు ఆన్‌లైన్‌లో ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించవచ్చు. వార్షిక ఆదాయాన్ని, మినహాయింపులను గురించి సులభంగా తెలుసుకోవడానికి సాధారణ పౌరులు(60 ఏళ్ళలోపు వారు), సీనియర్ సిటిజన్(60-79 వయసు వారు), సూపర్ సీనియర్ సిటిజన్(79 ఏల్లు పైబడిన వాళ్లు) అనే మూడూ వర్గాలుగా విభజించారు.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ఆదాయపు పన్ను శ్లాబ్‌లను ప్రకటించారు. దీనికి కొత్త, సరళీకృత వ్యక్తిగత పన్ను పాలనగా అభివర్ణించారు. కొత్త శ్లాబ్ విధానం ప్రకారం… రూ. 5 లక్షల నుంచి రూ. 7.5 లక్షలు ఆదాయం ఉన్న వారు 10% పన్ను చెల్లించాలి. రూ. 5 లక్షలలోపు ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే, రూ. 7.5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు 15% చెల్లించాలి. సంవత్సరానికి రూ. 10 లక్షల నుంచి రూ. 12.5 లక్షల మధ్య వారు 20% చెల్లించాలి. రూ. 12.5 లక్షల నుంచి రూ. 15 లక్షల ఆదాయం ఉన్నవారు 25% పన్ను చెల్లించాలి. ఈ కొత్త విధానంలోని కోతల కారణంగా ఏడాదిలో ప్రభుత్వానికి రూ. 40,000 కోట్లు ఖర్చవుతాయి. తగ్గింపులు, మినహాయింపులు వద్దనుకునే వారికి ఆదాయపు పన్ను రేట్లు గణనీయంగా తగ్గుతాయని ఆర్థిక మంత్రి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed