కేసీఆర్ లాంటి సీఎం తెలంగాణకు అవసరమా: వైఎస్ షర్మిల

by  |
కేసీఆర్ లాంటి సీఎం తెలంగాణకు అవసరమా: వైఎస్ షర్మిల
X

దిశ‌, ములుగు : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజ‌ల‌తో అవ‌స‌రం తీరుగా వ్యవ‌హ‌రిస్తార‌ని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు ష‌ర్మిల విమ‌ర్శించారు. ప్రజ‌ల‌కు అమ‌లు కాని హామీలిచ్చి, ఆదివాసి, గిరిజ‌నుల‌కు అన్యాయం చేసే ముఖ్యమంత్రి తెలంగాణ స‌మాజానికి అవ‌స‌ర‌మా అంటూ సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ దొర.. గిరిజనులు, ఆదివాసీలు నీకు బానిస‌లా..? అంటూ నిలదీశారు. పోడు భూములకై పోరు యాత్ర కార్యక్రమం బుధ‌వారం ములుగు జిల్లాలో కొన‌సాగింది. గోవిందారావుపేట‌, ప‌స్రా, ములుగు, తాడ్వాయిల మీదుగా ఆమె యాత్ర కొన‌సాగింది. తాడ్వాయి మండ‌లం లింగాల గ్రామ పోడు రైతుల‌తో ష‌ర్మిల ప్రత్యేకంగా భేటీ అయి వారి స‌మ‌స్యల‌ను తెలుసుకునే ప్రయ‌త్నం చేశారు. ఫారెస్ట్ అధికారుల‌తో ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను ఈ సంద‌ర్భంగా గిరిజ‌న‌, ఆదివాసీ రైతులు ష‌ర్మిల దృష్టికి తీసుకెళ్లారు.

గ‌తంలో ప‌ట్టాలు పొందిన వారిని సైతం అధికారులు ఇబ్బందులు గురి చేస్తున్నార‌ని ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ హాయంలో అంద‌జేసిన ప‌ట్టాల‌తో కొంత‌మంది పోడు రైతుల‌కు న్యాయం జ‌రిగింద‌ని గిరిజ‌నులు గుర్తు చేసుకున్నారు. లింగాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ష‌ర్మిల మాట్లాడుతూ.. జల్‌, జంగిల్‌, జమీన్‌ కోసం ఆనాడు కొమురం భీం పోరాటం చేస్తే నేడు అడవి బిడ్డలు పోడు భూములను కాపాడుకోవడమే ధ్యేయంగా పోరాటం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్‌ గిరిజనుల భూములను లాక్కొని వారిపై కేసులు మోపుతూ జైళ్లలో పెడుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నిక ఉంది కాబ‌ట్టే అక్కడ ద‌ళిత బంధు అమ‌లు చేస్తున్నార‌ని, గిరిజ‌నుల‌కు ఎందుకు గిరిజ‌న బంధు అమ‌లు చేయ‌వు అంటూ ప్రశ్నించారు.

ఇలాంటి సీఎం తెలంగాణ‌కు అవ‌స‌ర‌మా..?

అడ‌వులపై ఎవ‌రి ఆధిప‌త్యం ఉండ‌ద‌ని, అది ఆదివాసీల హ‌క్కు అని అన్నారు. ఆదివాసీల‌ను అడవుల నుంచి వెళ్ళగొట్టే అధికారం ఎవరికీ లేదన్నారు. నాడు ఆదివాసీల పోడు భూములకు వైఎస్సార్ చొర‌వ‌తో ప‌ట్టాలు జారీ చేస్తే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కొత్త పట్టాలు ఇవ్వకపోగా ఉన్న పట్టాలను లాక్కుని ఆదివాసీలను ఆగం చేస్తోంద‌ని దుయ్యబ‌ట్టారు. కేసీఆర్ అవసరానికి కాళ్లు ప‌ట్టుకుంటాడ‌ని, అవ‌స‌రం తీరాకా జుట్టు పడతాడని విమర్శించారు. అలాంటి సీఎం తెలంగాణ ప్రజ‌ల‌కు అవ‌స‌ర‌మా..? అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్‌లాగే అర్హులైన ఆదివాసీలంద‌రికీ పోడు భూముల‌పై ప‌ట్టాలంద‌జేస్తామ‌ని హామీ ఇచ్చారు. ప్రస్తుతం 7లక్షల మంది పోడు భూముల కోసం వేచిచూస్తున్నార‌ని, గిరిజనులను మంత్రులు, ఎమ్మెల్యేల కాళ్లా వేళ్లా పడ్డా పట్టాలు ఇవ్వడం లేద‌న్నారు. ప్రశ్నించే వారు లేక కేసీఆర్ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నార‌న్నారు. ఇక నుంచి నీ ఆటలు సాగవు. రాజన్న బిడ్డ వచ్చింది. వైయస్ఆర్ తెలంగాణ పార్టీ వచ్చింది. ఇక నుంచి గిరిజనుల పక్షాన పోరాడుతామంటూ వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Next Story