మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయనున్న పాకిస్తాన్

by Harish |
మహారాజా రంజిత్ సింగ్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయనున్న పాకిస్తాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్తార్‌పూర్ సాహిబ్‌లో మహారాజా రంజిత్ సింగ్ పునరుద్ధరణ చేసిన విగ్రహాన్ని ప్రతిష్టించనున్నట్లు పాకిస్తాన్ పంజాబ్ ప్రభుత్వం మంగళవారం తెలిపింది. అంతకుముందు ఇదే చోట రంజిత్ సింగ్ తొమ్మిది అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం ఉండగా, తీవ్రవాద ఇస్లామిక్ రాజకీయ పార్టీ అయిన తెహ్రీక్-ఎ-లబ్బైక్ పాకిస్తాన్ (TLP) కార్యకర్తలు ధ్వంసం చేశారు. దాంతో తిరిగి ఆ విగ్రహాన్ని పునరుద్ధరణ చేశారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక, భారత సిక్కుల సమక్షంలో విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నామని పంజాబ్ మొదటి సిక్కు మంత్రి, పాకిస్తాన్ సిక్కు గురుద్వారా పర్బంధక్ కమిటీ (PSGPC) అధ్యక్షుడు (పర్ధాన్) సర్దార్ రమేష్ సింగ్ అరోరా చెప్పారు. ఇకపై భారతీయ సిక్కులు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించవచ్చు. ఈ సారి విగ్రహానికి ఏం కాకుండా చూడటానికి మరింత భద్రత కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

కర్తార్‌పూర్ సాహిబ్‌ను గురుద్వారా దర్బార్ సాహిబ్ అని కూడా పిలుస్తారు. ఇది లాహోర్‌కు ఈశాన్యంగా 150 కి.మీ దూరంలో భారత సరిహద్దుకు దగ్గరగా ఉంది. మహారాజా రంజిత్ సింగ్ సిక్కు సామ్రాజ్య స్థాపకుడు.19వ శతాబ్దం ప్రారంభంలో లాహోర్‌లో తన ప్రధాన కార్యాలయంతో వాయువ్య భారత ఉపఖండాన్ని పాలించారు. మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతికి సంబంధించి ఉత్సవాల్లో పాల్గొనడానికి గత వారం భారతదేశం నుండి కర్తార్‌పూర్‌కు వెళ్లిన 455 మంది సిక్కులు కూడా బుధవారం విగ్రహావిష్కరణలో పాల్గొంటారు.

Advertisement

Next Story

Most Viewed