Nasrallah: నస్రల్లా మృతదేహం స్వాధీనం.. చెక్కు చెదరని శరీరం!

by vinod kumar |
Nasrallah: నస్రల్లా మృతదేహం స్వాధీనం.. చెక్కు చెదరని శరీరం!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్ దాడిలో మరణించిన హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా మృతదేహం లభ్యమైంది. లెబనాన్ రాజధాని బీరూట్‌లో దాడి జరిగిన ప్రదేశం నుంచే లెబనాన్ భద్రతా బలగాలు నస్రల్లా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి. అయితే హసన్ శరీరంపై ఎలాంటి గాయాలూ లేవని తెలుస్తోంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించిన కారణంగానే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు అనుమానిస్తున్నారు. హసన్ ఎలా చంపబడ్డాడు, అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయనే విషయాన్ని లెబనాన్ అధికారులు వెల్లడించలేదు. కాగా, హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ బీరూట్‌లో శుక్రవారం ఇజ్రాయెల్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లోనే నస్రల్లా మృతి చెందారు. దీనిని హిజ్బుల్లా సైతం ధ్రువీకరించింది. ఈ నేపథ్యంలోనే ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) కొన్ని రోజులుగా లెబనాన్‌పై దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్‌లో పౌరులపై దాడికి ప్లాన్ చేస్తున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాను అంతం చేయడమే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఆదివారం సైతం లెబనాన్‌లోని ఐన్ నగరంపై వైమానిక దాడి చేసింది. ఇందులో 11 మంది చనిపోయినట్టు స్థానిక కథనాలు వెల్లడించాయి. అంతేగాక ఈ దాడుల్లో మరొక హిజ్బుల్లా కీలక నేత నబిల్ కౌక్ కూడా హతమైనట్టు ఐడీఎఫ్ తెలిపింది. కౌక్ 1995 నుంచి దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా సైనిక కమాండర్‌గా పనిచేస్తున్నాడని పేర్కొంది. అయితే దీనిపై హిజ్బుల్లా స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed