కెనడాలో భారతీయుల నిరాహార దీక్ష..కారణమిదే?

by vinod kumar |
కెనడాలో భారతీయుల నిరాహార దీక్ష..కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్‌(పీఈఐ) స్థానిక ప్రభుత్వం విదేశీ కార్మికులను తగ్గించాలని తీసుకున్న నిర్ణయంతో అక్కడ పని చేస్తున్న భారతీయుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చార్లెస్ టౌన్‌లో భారతీయులు నిరాహార దీక్ష చేపట్టారు. అయితే మూడు రోజుల నుంచే ఈ కార్యక్రమం చేపడుతున్నప్పటికీ ఇక నుంచి సంపూర్ణ నిరాహార దీక్ష చేయనున్నట్టు తాజాగా ప్రకటించారు. ద్రవ పదార్థాలు కూడా తీసుకోమని స్పష్టం చేశారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో మార్పుల కారణంగా సుమారు 50 మంది కార్మికులు ఇప్పటికే కెనడాను విడిచిపెట్టారని, మరి కొందరు నిరసనకారులు వేధింపులను ఎదుర్కొన్నారని స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. భారత కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని నిరసన కారులు హెచ్చరించారు.

వలస కార్మికుల సంఖ్యను 2,100 నుంచి సుమారు 1,600కి తగ్గించాలని ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్‌ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అంతేగాక శాశ్వత నివాస సంఖ్యను కూడా 25 శాతం తగ్గించనున్నట్లు తెలిపింది. నామినేట్ చేసే సేల్స్, సర్వీస్ వర్కర్ల సంఖ్యను 2023లో 800 ఉండగా..ప్రస్తుతం 200కి తగ్గించింది. ఇది ప్రాంతీయ నామినీ ప్రోగ్రామ్‌లో విదేశీ నామినీల సంఖ్యను కూడా తగ్గిస్తుంది. మారిన విధానం ప్రకారం రాబోయే వలసదారుల సంఖ్యను తగ్గించాల్సి ఉన్నందున నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ వంటి కొన్ని రంగాలకు అనుకూలంగా ఉంటుంని ప్రభుత్వం తెలిపింది.

ఇటీవలి సంవత్సరాలలో ప్రావిన్స్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన జనాభాను నియంత్రించడానికి వలసలను తగ్గించాల్సిన అవసరం ఉందని పీఈఐ ప్రభుత్వం వెల్లడించింది. జనాభా పెరుగుదల గృహ సంక్షోభానికి దోహదపడిందని, ప్రావిన్స్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై కూడా ఒత్తిడి తెచ్చిందని అభిప్రాయపడింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విదేశీయులు నిరసనలకు దిగారు. ఈ మార్పులు సేవా పరిశ్రమతో పాటు యజమానులపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

Advertisement

Next Story