దుబాయ్‌లో భారీ వర్షాలు..నీట మునిగిన ఎయిర్ పోర్టు, మెట్రో స్టేషన్లు!

by Dishanational2 |
దుబాయ్‌లో భారీ వర్షాలు..నీట మునిగిన ఎయిర్ పోర్టు, మెట్రో స్టేషన్లు!
X

దిశ, నేషనల్ బ్యూరో: దుబాయ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంబించింది. మంగళవారం సాయంత్రం ఒక్క సారిగా ఆకస్మికంగా వర్షాలు కురవడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో దహదారులు నీట మునిగాయి. అంతేగాక ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్ పోర్టు సైతం నీటమునిగింది. దీంతో పలు విమానాలను రద్దు చేయగా..మరి కొన్నింటిని దారి మళ్లించారు. ఇందులో భారత్, పాక్, సౌదీ విమానాలున్నాయి. అలాగే సుమారు 25 నిమిషాల పాటు ఎయిర్ పోర్టులో కార్యకలాపాలు నిలిపివేసినట్టు సమాచారం. సుమారు120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అబుదాబి, షార్జాతో సహా పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

భారీగా వరదలు రావడంతో షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాల్స్ నీట మునిగాయి. దుబాయ్ మెట్రో స్టేషన్‌లో మోకాళ్లలోతు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్లపై కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు సైతం కనిపించాయి. నైరుతి నుంచి అల్పపీడనం ఏర్పడటమే గల్ఫ్ దేశాల్లో వాతావరణ మార్పునకు ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. అయితే గతేడాది కాప్ 28 సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన ఒమన్, యూఏఈలు రెండూ గ్లోబల్ వార్మింగ్ వల్ల మరింత వరదలకు దారితీసే అవకాశం ఉందని తెలిపాయి.

ఒమన్‌లో 18 మంది మృతి

మరోవైపు దుబాయ్ పొరుగున ఉన్న ఒమన్‌లోనూ గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ఘటనల్లో 18 మంది మృతి చెందగా..పలువురు తప్పిపోయారు. మస్కట్ సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ కూడా అధిక వర్షపాతం నమోదవ్వగా భారీ వరదల కారణంగా దేశంలోని ప్రధానమైన రహదారులు మూసుకుపోయినట్టు సమాచారం.

Next Story

Most Viewed