Musharraf : ఆ బ్యాంకు స్టాఫ్ కార్యక్రమంలో ముషారఫ్‌కు నివాళులు ?

by Hajipasha |   ( Updated:2024-07-27 19:17:58.0  )
Musharraf : ఆ బ్యాంకు స్టాఫ్ కార్యక్రమంలో ముషారఫ్‌కు నివాళులు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని అలప్పుజా నగరంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సు వివాదానికి దారితీసింది. ఎందుకంటే ఈ సదస్సు సందర్భంగా నివాళులర్పించే ప్రముఖుల పేర్లతో ముద్రించిన ఇన్విటేషన్‌ కాపీలో పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ పేరును కూడా ప్రస్తావించారు. అయితే పొరపాటున ఈ తప్పిదం చోటుచేసుకుందని తదుపరిగా గుర్తించారు. దీంతో ఆ ఆహ్వాన లేఖ నుంచి ముషారఫ్ పేరును తొలగించారు. ఆ పేరును ప్రస్తావించకుండానే శనివారం రోజు అలప్పుజా నగరంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ సమావేశం జరిగింది.

అయినా బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థానిక స్టాఫ్ యూనియన్ తీరును నిరసిస్తూ సమావేశ వేదిక వద్ద బీజేపీ శ్రేణులు నిరసన తెలిపాయి. కార్యక్రమ నోటీసు ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ రాష్ట్ర సదస్సును కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసీ వేణుగోపాల్ ప్రారంభించాల్సి ఉందని తెలిసింది. అయితే ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు. కాగా, 1999లో భారత్‌లోని కార్గిల్‌లోకి రహస్యంగా చొరబడాలంటూ పాక్ సైన్యాన్ని ప్రోత్సహించింది పర్వేజ్ ముషారఫే.

Advertisement

Next Story