Bangladesh : బంగ్లాదేశ్ ప్రభుత్వ టీవీ స్టేషన్ హెడ్ క్వార్టర్స్‌కు నిప్పు

by Hajipasha |
Bangladesh : బంగ్లాదేశ్ ప్రభుత్వ టీవీ స్టేషన్ హెడ్ క్వార్టర్స్‌కు నిప్పు
X

దిశ, నేషనల్ బ్యూరో : యుద్ధ వీరుల పిల్లలు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్ కోటాను రద్దు చేయాలంటూ బంగ్లాదేశ్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధాని ఢాకాలోని ప్రభుత్వ టీవీ స్టేషన్ ప్రధాన కార్యాలయానికి ఆందోళనకారులు గురువారం నిప్పుపెట్టారు. ఈ కార్యాలయం నుంచే ‘బీ టీవీ’ పేరుతో ప్రభుత్వ న్యూస్ ఛానల్ ప్రసారమయ్యేది. తాజా ఘటనతో ఆ ఛానల్ ప్రసారాలకు అంతరాయం వాటిల్లింది. చాలామంది బీ టీవీ భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వందలాది మంది నిరసనకారులు ఒక్కసారిగా బీటీవీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం ప్రాంగణంలోని దాదాపు 60 వాహనాలను తగలబెట్టారు. అనంతరం కార్యాలయ భవనానికి నిప్పుపెట్టారు. ఈక్రమంలో ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు కాల్పులు జరపగా.. ఆగ్రహించిన అల్లరిమూక సమీపంలోని రాంపుర పోలీసు చెక్ పోస్టుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేసిన బీటీవీ.. మంటల వలయంలో న్యూస్ ఛానల్ ఉందని వెల్లడించింది.

న్యాయవిచారణ చేయిస్తాం : షేక్ హసీనా

ప్రధానమంత్రి షేక్ హసీనా స్పందిస్తూ.. ఈ అల్లర్లపై న్యాయ విచారణ చేయిస్తామని ప్రకటించారు. హింసాకాండ వెనుక ఎవరున్నారో నిగ్గు తేలుస్తామన్నారు. ఆమోదయోగ్యం కాని డిమాండ్లను నెరవేర్చుకునేందుకు ఇలాంటి హింసకు తెగబడటం సముచితం కాదని ఆమె తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed