Kenya: కెన్యాలో స్కూల్ హాస్టల్‌లో తీవ్ర విషాదం

by Harish |
Kenya: కెన్యాలో స్కూల్ హాస్టల్‌లో తీవ్ర విషాదం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్రికా దేశం కెన్యాలో తీవ్ర విచారకర ఘటన చోటుచేసుకుంది. ఒక స్కూల్ హాస్టల్‌లో రాత్రిపూట మంటలు చెలరేగగా దాదాపు 17 మంది పిల్లలు మృతి చెందారు. సెంట్రల్ కెన్యాలోని నైరీ కౌంటీలోని హిల్‌సైడ్ ఎండరాషా అకాడమీ హాస్టల్‌లో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. ఈ సమయంలో పిల్లలు నిద్రలో ఉండగా, ఒక్కసారిగా వారిని మంటలు చుట్టుముట్టాయి. దాంతో 17 మంది పిల్లలు మృతి చెందారు. మంటల తాకిడి నుంచి తప్పించుకునే క్రమంలో చాలా మందికి గాయాలయ్యాయి. ముఖ్యంగా గాయపడిన వారిలో 16 మంది తీవ్రంగా కాలిపోయిన గాయాలతో అల్లాడిపోయారు. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు.

ఇక్కడ దాదాపు ఐదు నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల 800 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే మరణించిన వారిలో కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని జాతీయ పోలీసు ప్రతినిధి రెసిలా ఒన్యాంగో చెప్పారు. మృతుల సగటు వయసు తొమ్మిదేళ్లు ఉంటుంది. అయితే మరణాలు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు, అయితే దర్యాప్తు ప్రారంభించామని ఒన్యాంగో చెప్పారు. ఈ పాఠశాల నైరీ కౌంటీలో రాజధాని నైరోబీకి ఉత్తరాన 170 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రమాదంపై అధ్యక్షుడు విలియం రూటో సంతాపం తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన పిల్లల కుటుంబాలతో మా ఆలోచనలు ఉన్నాయి, ఈ భయానక ఘటనను క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించాను, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisement

Next Story