అత్తింటి వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

by srinivas |
అత్తింటి వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
X

దిశ, ఏపీ బ్యూరో: అత్తింటి వేధింపులకు అబల బలైంది. ఒకవైపు భర్త వేధింపులు..మరోవైపు అత్తమామల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లైన రెండున్నరేళ్లకు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఎంతో ఘనంగా పెళ్లి చేసిన తండ్రి.. కూతురు ఇక లేదనే విషయాన్ని తెలుసుకుని గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. ఈ హృదయ విదారకర ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా ఇడమడక గ్రామానికి చెందిన లక్ష్మీభారతి(22)కి కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం గొడెగనూర్‌ గ్రామానికి చెందిన సుబ్బయ్యతో రెండున్నరేళ్ల క్రితం వివాహం జరిగింది.

పెళ్లైన ఏడాదిన్నర వరకు ఎంతో సాఫీగా జరిగిన వీరి సంసారంలో మద్యం చిచ్చు రేపింది. భర్త మద్యానికి బానిసగా మారడంతో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. అంతేకాదు వేధింపులకు సైతం పాల్పడేవాడు. భర్త సుబ్బయ్య ప్రవర్తనలో మార్పుకోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. అత్త, మామల వద్ద తన భర్త పరిస్థితి చెప్పుకుని..తన కాపురాన్ని నిలబెట్టాలని కోరుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. భర్త వేధింపులకు అత్తమామలు కూడా తోడవ్వడంతో లక్ష్మీభారతి తట్టుకోలేకపోయింది. ఈ వేధింపులు తీవ్రమవ్వడంతో ఈనెల 6న లక్ష్మీభారతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ మారుతి తెలిపారు. అప్పటి నుంచి కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి తండ్రి పెద్ద నరసింహులు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ మారుతి వివరించారు.

Next Story

Most Viewed