ఢిల్లీ సర్కారుపై ముప్పేట దాడి

by Shamantha N |
ఢిల్లీ సర్కారుపై ముప్పేట దాడి
X

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంతో ఆక్సిజన్, ఇతర వైద్య సదుపాయాల కొరతతో కొట్టుమిట్టాడుతున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ప్రభుత్వంపై ఢిల్లీ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం ముప్పేట దాడికి దిగాయి. పలు పిటిషన్లపై మంగళవారం విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. ఆమ్ ఆద్మీ (ఆప్) సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సంతృప్తికరంగా లేవని మండిపడింది. తమను ప్రసన్నం చేసుకోవడం మాని.. రాజధానిలో కోరలు చాచిన కరోనా వైరస్ కట్టడిపై దృష్టి సారించాలని హితువు పలికింది. ఒకవేళ మీకు (ఢిల్లీ ప్రభుత్వం) చేతకాకుంటే పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలా..? అని ప్రశ్నించింది. కొవిడ్ కట్టడికి తక్షణ చర్యలు చేపట్టాలని జస్టిస్ విపిన్ సంఘి, జస్టిస్ రేఖా పల్లిలతో కూడిన ధర్మాసనం సూచించింది.

ప్రభుత్వ వ్యవస్థ విఫలం..

ఆక్సిజన్ సిలిండర్లు, ఔషధాలు (రెమిడెసివిర్ వంటివి) బ్లాక్ మార్కెట్‌కు తరలడాన్ని ఢిల్లీ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఒకవైపు ఆస్పత్రులలో ఆక్సిజన్ సిలిండర్లు, మెడికల్ కిట్లు, ఔషధాలు లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే అవి బ్లాక్ మార్కెట్‌లో ఎలా లభ్యమవుతున్నాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని నియంత్రించడంలో ఢిల్లీ సర్కారు యంత్రాంగం దారుణంగా విఫలమైందని ఆక్షేపించింది. ప్రభుత్వం స‌ర‌ఫ‌రా చేసే ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లపై అకౌంటింగ్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో వాటి కొరత ఏర్పడి, అది బ్లాక్ మార్కెటింగ్‌కు దారితీసింద‌ని ఆరోపించింది. వందల రూపాయలు విలువ చేసే ఔషధాలు.. ప్రజలకు లక్షలు ఖర్చు చేసినా దొరకడం లేదని, వాటిని బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి దాపురించిందని ఆందోళ‌న వ్యక్తం చేసింది.

‘మీకు అధికారాలున్నాయి. బ్లాక్ మార్కెట్ దందాపై కఠిన చర్యలు తీసుకోండి..’ అంటూ ఆప్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘ఒకవేళ మీవల్ల కాకుంటే పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తాం’ అని వ్యాఖ్యానించింది. అంతేగాక ఢిల్లీలో అందుబాటులో ఉన్న ఆక్సిజ‌న్ నిల్వల ప‌రిస్థితిని తెలియజేస్తూ బుధవారం ఉదయం నాటికి కోర్టుకు నివేదిక సమర్పించాలని కేజ్రీవాల్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ‘రాబందులు సొమ్ము చేసుకునేందుకు ఇది స‌మ‌యం కాదు. బ్లాక్ మార్కెటింగ్ ఏమాత్రం మాన‌వ‌త్వం కాదు..’ అని ఆక్సిజ‌న్ రీఫిల్లర్ ల‌కు కోర్టు హిత‌వు ప‌లికింది.

హైక్లాస్ ఫెసిలిటీస్ కావాలని మేం అడిగామా..?

ఢిల్లీలోని న్యాయమూర్తులకు అశోక వంటి ఫైవ్‌స్టార్ హోటల్‌లో హైక్లాస్ సేవలు కావాలని తాము అడిగామా..? అని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. కరోనా బారిన పడే జడ్జిలకు, వారి కుటుంబాలకు అశోక హోటల్ లో 100 బెడ్లను కేటాయిస్తూ ఢిల్లీ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై దాఖలైన ఓ పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం.. ‘5 స్టార్ హోటల్ లో వంద బెడ్లతో సకల సౌకర్యాలు కావాలని మేం ఎప్పుడు అడిగాం..?’ అని ప్రశ్నించింది. ఎవరైనా న్యాయమూర్తి గానీ, కిందిస్థాయి సిబ్బంది గానీ ఒకవేళ కరోనా బారిన పడితే వారికి ఆస్పత్రులలో తగిన సాయం అందించండని మాత్రమే తాము కోరామని కోర్టు ఈ సందర్భంగా తెలిపింది. కోర్టును ప్రసన్నం చేసుకోవాలనుకుంటున్నారా..? అని మందలించింది. ఈ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మీ అంతరాత్మను సంతృప్తి పరుచుకునేందుకే…

కరోనా నేపథ్యంలో ఎమర్జెన్సీ కేసులను ఆస్పత్రి వర్గాలు 10 నిమిషాల్లో అటెండ్ చేసి పేషెంట్లకు ఆక్సిజన్, మెడిసిన్స్ ఇవ్వాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను హైకోర్టు ప్రశ్నించింది. మహారాజ అగ్రసేన్ హాస్పిటల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం తీవ్రంగా మండి పడింది. ఈ ఆదేశాలను ప్రభుత్వం తన అంతరాత్మను సంతృప్తి పరుచుకునేందుకు పేపర్ పై చేసిన యాక్షన్‌గా ధర్మాసనం అభివర్ణించింది. కేవలం దీనితోనే ప్రభుత్వం తన బాధ్యత తీరిపోయిందనుకుంటుందా అంటూ ప్రశ్నించింది.

తప్పు మీదే : కేంద్రం ఆరోపణ

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దానిని ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుంటుండగా, ఢిల్లీ ప్రభుత్వం మాత్రం అందులో విఫలమైందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఆక్సిజన్‌ను తమ రాష్ట్రాలకు చేర్చేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు వృత్తిపరమైన నైపుణ్యంతో సరైన చర్యలు తీసుకుంటున్నాయని కేంద్రం తెలిపింది. కానీ ఢిల్లీ సర్కారు మాత్రం లాజిస్టికల్ సమస్యల పరిష్కారానికి తీసుకున్న చర్యలు లోపభూయిష్టంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్‌ను కేటాయించి రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఆప్ ప్రభుత్వం ట్యాంకర్లను సమకూర్చలేదని ఆరోపించింది. ఈ విషయంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed