గ్రామాల్లో ‘కొవిన్‌’ నమోదు సాధ్యమేనా?.. కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు

by vinod kumar |   ( Updated:2021-05-31 06:40:36.0  )
గ్రామాల్లో ‘కొవిన్‌’ నమోదు సాధ్యమేనా?.. కేంద్రానికి సుప్రీంకోర్టు ప్రశ్నలు
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తు్న్న టీకా పంపిణీ పాలసీపై సుప్రీంకోర్టు బలమైన ప్రశ్నలను సంధించింది. టీకాలకు భిన్న ధరలు, కొరత, గ్రామీణులకు అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను లేవనెత్తింది. వాస్తవ పరిస్థితులకు దూరంగా ప్రణాళికలను రూపొందించారని, గ్రౌండ్ సిచ్యుయేషన్‌కు తగినట్టుగా పాలసీని సవరించాల్సిన అవసరముందని సూచించింది. గ్రామాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ ఏ స్థాయిలో ఉంటుందని ప్రశ్నిస్తూనే అక్కడ టీకా కోసం కొవిన్‌లో నమోదు చేసుకోవడం సాధ్యమేనా అని అడిగింది. దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ అక్షరాస్యత అసమానతలను దృష్టిలో పెట్టుకోలేదా? అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ఎన్ రావు, జస్టిస్ ఎస్ రవీంద్రభట్‌లతో కూడిన ప్రత్యేక ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇవేవీ పట్టించుకోకుండా కొవిన్‌ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి చేయడమేంటని ప్రశ్నించింది. ‘మీరు డిజిటల్ ఇండియా అని తరుచూ అంటుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అలా లేవు.

జార్ఖండ్ నుంచి రాజస్తాన్‌కు వలసవెళ్లిన ఓ నిరక్షరాస్య కార్మికుడు కొవిన్‌లో ఎలా నమోదు చేసుకుంటాడు. ఈ డిజిటల్ డివైడ్‌ను ఎలా పరిష్కరిస్తారో చెప్పండి’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా అడిగింది. గ్రౌండ్ సిచ్యుయేషన్‌కు తగినట్టుగా పాలసీని మార్చండి అని సూచించింది. కొవిన్‌లో నమోదు చేసుకుంటేనే రెండో డోసు కోసం ఆ వ్యక్తిని సులువుగా ట్రేస్ చేయగలమని మెహెతా సమాధానమిచ్చారు. గ్రామీణంలో కమ్యూనిటీ సెంటర్‌లు ఉంటాయని, అక్కడే వారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించారు. ఇది సాధ్యమని భావిస్తున్నారా? అని ప్రశ్నించింది. పాలసీ డాక్యుమెంట్‌ సమర్పించాల్సిందిగా ఆదేశించింది.

ఈ ఏడాది చివరికల్లా భారతీయులందరికీ టీకాలను పంపిణీ చేయాలని కేంద్రం యోచిస్తున్నట్టు కోర్టుకు తెలియజేసింది. ఇందులో ఉన్న లోపాలను, అవాంతరాలను సుప్రీంకోర్టు వెలికితీసింది. ‘45ఏళ్లు పైబడినవారికి కేంద్రం ఉచితంగా టీకాలను సమకూరుస్తున్నది. కేవలం వారికే ఎందుకు ఉచితంగా సరఫరా చేస్తున్నది. వారిలో డెత్ రేట్ ఎక్కువ ఉందని సమర్థించుకోవచ్చు. కానీ, సెకండ్ వేవ్‌లో యువతలోనే ఎక్కువ మరణాలు సంభవిస్తు్న్నాయి. వారికీ టీకా వేయడానికి రాష్ట్రాలు కంపెనీల ఉత్పత్తిలో 50శాతం వాటా నుంచి కొనుగోలు చేసుకోవాలని తెలిపింది. ప్రైవేటు హాస్పిటళ్లు ఇందులోనుంచే కొనుగోలు చేసుకోవాలని సూచించింది. ఇలాగే డివైడ్ చేయడానికి గల కారణాలేమిటి? అసలు టీకాల ధరలనూ దేని ఆధారంగా అనుమతినిచ్చారు. కేంద్రానికంటే రాష్ట్రాలు ఎందుకు ఎక్కువ వెచ్చించాలి. కేంద్రానికి టీకా ధరలను నిర్ణయించి, రాష్ట్రాలు, ప్రైవేటు హాస్పిటళ్లకు సరఫరా చేయడానికి ధర నిర్ణయించే అధికారం కంపెనీలకు ఎందుకు కట్టబెట్టింది?’ అని ప్రశ్నలు గుప్పించింది.

‘గ్లోబల్ టెండర్ల కోసం రాష్ట్రాలు, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా బిడ్లు వేయాల్సి వస్తున్నదని, అసలు కేంద్ర ప్రభుత్వమే ఒక నోడల్ ఏజెన్సీగా ఎందుకు విదేశాల నుంచి సమకూర్చడం లేదని ధర్మాసనం అడిగింది. స్పుత్నిక్ వీ నుంచి ముంబై బిడ్లు స్వీకరించింది. గ్లోబల్ టెండర్లను రాష్ట్రాలకే వదిలిపెడతారా? కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కదా? విదేశాల నుంచి రాష్ట్రాలు టీకాలను కొనుగోలు చేయడం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు’ అని పేర్కొంది. తమ ప్రశ్నలన్నింటికి రెండు వారాల్లో వివరణ అందించాల్సిందిగా ఆదేశించింది.

Advertisement

Next Story

Most Viewed