స్వల్ప లాభాలతో సరిపెట్టిన సూచీలు!

by GSrikanth |
స్వల్ప లాభాలతో సరిపెట్టిన సూచీలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్‌లో లాభాలను సాధించాయి. మంగళవారం ట్రేడింగ్‌లో రోజంగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత సూచీలు చివర్లో స్వల్ప లాభాలతో సరిపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ, చైనాలో కరోనా మహమ్మారి సంబంధిత అంక్షలు తగ్గించిన నేపథ్యంలో దేశీయ మార్కెట్లకు సానుకూల సంకేతాలందాయి.

ఈ వారంలో ఎఫ్అండ్ఓ గడువు ముగుస్తుండటం, గ్లోబల్ మార్కెట్ల ప్రభావం కారణగా మిడ్-సెషన్ వరకు నష్టాల్లో కదలాడిన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు మద్దతిచ్చారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 16.17 పాయింట్లు పెరిగి 53,177 వద్ద, నిఫ్టీ 18.15 పాయింట్లు లాభపడి 15,850 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు పుంజుకోగా, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలు క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఎంఅండ్ఎం, రిలయన్స్, డా రెడ్డీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్అండ్‌టీ కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించగా, టైటాన్, ఏషియన్ పెయింట్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి.

ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి మారకం..

మరోవైపు రూపాయి కరెన్సీ రోజురోజుకు బలహీనపడుతోంది. మంగళవారం ట్రేడింగ్‌లో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ఏకంగా 46 పైసలు పతనమై రూ. 78.83కి చేరుకుంది. బలహీనమైన దేశీయ ఈక్విటీ మార్కెట్లు, ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రూపాయి విలువ బలహీనపడుతోంది. విదేశీ పెట్టుబడిదారులు క్రమంగా మన మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకెళ్లడం కూడా రూపాయి కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపుతోందని నిపుణులు పేర్కొన్నారు. మార్కెట్ నిపుణుల ప్రకారం రానున్న రోజుల్లో డాలర్ విలువ రూ. 80 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story