కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ల నష్టాలు!

by Web Desk |
కొనసాగుతున్న స్టాక్ మార్కెట్ల నష్టాలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ సంకేతాలు బలంగా ఉండటంతో గ్లోబల్ మార్కెట్‌లో అధిక నష్టాలు దేశీయంగా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత తగ్గలేదనే పరిణామాలతో అమెరికా మార్కెట్లు సహా ఆసియా మార్కెట్లలోనూ ప్రతికూలత కనబడింది. దీనికితోడు దేశీయంగా ఫార్మా రంగం ఎక్కువ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోవడం తో వరుసగా మూడోరోజు నష్టాలు తప్పలేదు.

ప్రధానంగా శుక్రవారం ఉదయం నుంచే అంతర్జాతీయ బలహీన సంకేతాలతో దెబ్బతిన్న స్టాక్ మార్కెట్లు మిడ్-సెషన్ వరకు స్వల్ప నష్టాలు, లాభాల మధ్య ర్యాలీ చేశాయి. ఆ తర్వాత రష్యాతో ఉక్రెయిన్‌పై దాడికి సంబంధించి చర్చలు జరపనున్నట్టు అమెరికా ప్రకటించడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై కొంత తగ్గిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే, చివరి గంటలో వారాంతం లాభాల స్వీకరణ వల్ల సూచీలు నష్టాలను ఎదుర్కొన్నాయి.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59.04 పాయింట్లు కోల్పోయి 57,832 వద్ద, నిఫ్టీ 28.30 పాయింట్లు తగ్గి 17,276 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, బ్యాంకింగ్ ఇండెక్స్‌లు రాణించగా, రియల్టీ, ఫార్మా, మీడియా, ఆటో రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్అండ్‌టీ, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు కొంత లాభాలను దక్కించుకోగా, ఆల్ట్రా సిమెంట్, ఎంఅండ్ఎం, ఇన్ఫోసిస్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.64 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed