తెలంగాణ యువతే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ కీలక పిలుపు!

by GSrikanth |
తెలంగాణ యువతే లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ కీలక పిలుపు!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అధికార టీఆర్ఎస్‌ పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల్లో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ఉన్న అభిప్రాయన్ని తెలుసుకుంటున్నారు. టీఆర్ఎస్ ప్రచార సరళిని పూర్తిగా మార్చివేయడంతో పాటు, ఎన్నికల సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రశాంత్ కిశోర్ పనిచేయనున్నట్లుగా సమాచారం. ఇందుకోసం త్వరలోనే ఆయన తెలంగాణలోనే మకాం పెట్టనున్నట్లుగా చెబుతున్నారు. ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకొని, టీఆర్ఎస్ నాయకత్వానికి కీలక సూచనలు చేయనున్నట్లు సమాచారం.


ఈ నేపథ్యంలో తెలంగాణ యువతకు ప్రశాంత్ కిషోర్ కీలక పిలుపునిచ్చారు. ఆయన స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ(I-PAC)లో చేరడానికి యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రమంతటా ఐప్యాక్‌తో కలిసి రాజకీయ ప్రచార అనుభవాన్ని పొందాలని సూచించారు. అంతేగాక, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై శిక్షణ ఇచ్చి, ప్రచారాన్ని ముందుకు నడిపించే బాధ్యతలను ఐ-పీఏసీలో చేరిన యువతపై ప్రశాంత్ కిషోర్ పెట్టనున్నారు.

అయితే, దీని మూలంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలకు దెబ్బ పడనుంది. భారీ ఎత్తున యువత ప్రశాంత్ కిషోర్ టీమ్‌లో చేరితే రాష్ట్రమంతటా టీఆర్ఎస్‌కు అనుకూల పవనాలు వీయడం ఖాయం. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి యువత వరకూ ఆయన పిలుపు ఇవ్వడంతో క్షేత్రస్థాయి నుంచి టీఆర్ఎస్‌కు ఎక్కడెక్కడ నష్టం జరుగుతుందో తెలుసుకొని, దానిపై ప్రత్యేక దృష్టిపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాగా, రాజకీయాల్లో రాణించాలనుకున్న యువతకూ ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. మరి పీకే వ్యూహాలు తెలంగాణ రాజకీయాలపై ఏ రకమైన ప్రభావం చూపుతాయో చూడాలి.



Next Story