Delhi High-count: సంపాదించే సామర్థ్యం ఉన్న మహిళలు భరణం కోరద్దు: ఢిల్లీ హైకోర్టు

by S Gopi |   ( Updated:2025-03-21 18:39:40.0  )
Delhi High-count: సంపాదించే సామర్థ్యం ఉన్న మహిళలు భరణం కోరద్దు: ఢిల్లీ హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: విడాకుల తర్వాత భార్యకు, పిల్లల కోసం ఇచ్చే భరణం విషయంలో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు వెలువరించింది. ఓ విడాకుల కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా వాదనలు విన్న జస్టిస్‌ చంద్రధారీ సింగ్‌.. పని చేయకుండా ఉండటాన్ని చట్టం ప్రోత్సహించదని తెలిపింది. సంపాదన సామర్థ్యం, అర్హత కలిగిన మహిళలు తమ భర్తల నుంచి తాత్కాలిక భరణాన్ని క్లెయిమ్ చేయరాదని పేర్కొంది. భర్తతో గొడవపడి విడిగా ఉంటున్న భార్య తాత్కాలిక భరణం కావాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. చదువుకోని మహిళల తరహాలో భర్తలపై ఆధారపడకూడదని, చదువు, అర్హత ఉన్న మహిళలు సాధికారత కలిగి ఉండాలని ప్రధాన న్యాయమూర్తి సూచించారు. వాదనల సందర్భంగా సెక్షన్ 125, సీఆర్‌పీసీ ప్రకారం, భార్య, సంతానం, తల్లిదండ్రుల కోసం భర్త నుంచి ఆర్థిక సాయంగా చట్టం ద్వారా రక్షణ లభిస్తుందని కానీ, ఆ పేరు మీద ఖాళీగా ఉండటాన్ని కోర్టు అనుమతించదన్నారు. కాగా, 2019లో వివాహం చేసుకున్న మహిళ తన భర్తతో కలిసి సింగపూర్‌కు వెళ్లింది. ఆ తర్వాత భర్త, అతని కుటుంబం వేధిస్తున్నారనే కారణంతో 2021లో తిరిగి స్వదేశానికి వచ్చేసింది. భర్త నుంచి విడిపోయాక ఆర్థిక సమస్యలు మొదలయ్యాయని, ఉన్న బంగారం కూడా అమ్ముకున్న కారణంగా తాత్కాలిక భరణం ఇప్పించాలని అదే ఏడాది పిటిషన్ వేసింది. మొదట ఆమె ట్రయల్ కోర్టుకు వెళ్లగా, అక్కడ కొట్టివేయడంతో హైకోర్టులో మరో పిటిషన్ వేసింది.

Next Story