ఏపీలోనూ నీరా కేఫ్‌లు పెడతాం: మంత్రి జోగి రమేష్

by Satheesh |
ఏపీలోనూ నీరా కేఫ్‌లు పెడతాం: మంత్రి జోగి రమేష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీలోనూ నీరా కేఫ్‌ల ఏర్పాటుకు కృషి చేస్తామని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి జోగి రమేష్ అన్నారు. మంగళవారం మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు కె. కిశోర్ గౌడ్, సినీ హీరో తల్వార్ సుమన్‌తో కలిసి హైద‌రాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో ఉన్న నీరా కేఫ్‌ను పరిశీలించారు. స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రమేష్ మాట్లాడుతూ.. ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైనది నీరా అన్నారు. కేఫ్ అద్భుతంగా ఉందని, రాష్ట్ర ప్రజ‌ల‌కు అందించ‌డాన్ని ప్రశంసించారు. కల్లు అంటే ఒక అపోహ ఉండేదని ఈ కేఫ్‌తో తొలగిపోయిందన్నారు. పూర్వకాలంలో నీరాను దేవతలు సైతం తాగేవారని, అద్భుతమైన ఔషదగుణాలు కలిగిందన్నారు. అన్ని వయస్సుల వారు తీసుకోవచ్చన్నారు. నీరాకేఫ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం కులవృత్తికి పెద్దపీట వేసిందన్నారు.

వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించడం అబినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వ స్పూర్తిని ఏపీలోనూ కొనసాగిస్తామన్నారు. గౌడకులం బలోపేతానికి కృషి చేస్తామని, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పాటుపడతామని వెల్లడించారు. సినీనటుడు తల్వార్ సుమన్ మాట్లాడుతూ.. నీరాను అందరూ తాగోచ్చన్నారు. డయాబెటీస్ ఉన్నవారు సైతం తాగొచ్చని, ఎలాంటి హాని కలిగించదన్నారు. కూల్ డ్రింక్స్‌లల్లో కెమికల్స్ ఉన్నాయని తెలిసి తాగి ఆసుపత్రుల పాలవుతున్నామని వాటికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రకృతి సిద్ధమైన నీరాను ప్రజలు ఆదరించి, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, గౌడ సంఘం నాయకులు పతాని రామకృష్ణ, వింజమూరి సత్యంగౌడ్, కూనూరు నిరంజన్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed