Minister Sitakka : నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తాం

by Kalyani |
Minister Sitakka : నిరుపేదల సొంత ఇంటి కలను నెరవేరుస్తాం
X

దిశ, ములుగు ప్రతినిధి: రానున్న కొద్ది కాలంలోనే జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, ఆయా శాఖల అధికారులు మంజూరైన రోడ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేరుస్తాం అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం ములుగు మండలంలోని జంగాలపల్లి క్రాస్ నుండి ఎరుకల వాడ వరకు రూ.80 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్డు పనులను మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పంచాయతీరాజ్, ఐటీడీఏ, ఆర్ అండ్ బి శాఖల ద్వారా దాదాపు రూ.140 కోట్ల తో రోడ్డు పనులను చేపట్టడం జరుగుతుందని, 30 సంవత్సరాల గ్రామీణ ప్రాంతాల ప్రజల కల నెరవేరబోతున్నదని అన్నారు.

ఆయా శాఖల అధికారులు చేపట్టిన రోడ్డు పనులను రెండు మూడు నెలల్లో పూర్తి చేసే విధంగా చొరవ చూపాలని, ఇటీవలనే రూ. 33 కోట్లతో జంగాలపల్లి నుంచి అంకన్నగూడెం వరకు రోడ్డు పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు. ములుగు జిల్లా పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందడంతో పాటు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ, లక్నవరం సరస్సు లాంటి ప్రాంతాలకు జాతీయ రహదారితో అనుసంధానం చేస్తూ రోడ్డు వెడల్పు కార్యక్రమాలను చేపట్టబోతున్నామని స్పష్టం చేశారు.

ములుగు నియోజకవర్గానికి గతంలో 3 వేల 500 వందల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా నిరుపేదలకు అధిక మొత్తంలో ఇండ్ల నిర్మాణం చేపట్టాలని ఉద్దేశంతో 5000 ఇండ్లను మంజూరు చేయడం జరుగుతుందని, రానున్న రోజులలో ములుగు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో నిరుపేదలకు 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ పేరుతో నిర్మించే ఇంట్లో నిర్మాణ పనులను పూర్తిచేసి సొంత ఇంటి కలలు నెరవేరుస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈ ఈ వీరభద్రం, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story