అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజన తండాలు..

by Sumithra |
అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజన తండాలు..
X

దిశ, పర్వతగిరి : పర్వతగిరి మండలం బురుగుమడ్ల నుండి చింతలకుంట తండా, నెక్కొండ మండలం గొట్లకొండ పంచాయతీ మీదుగా మంగ్య తండా వరకు సరైన రహదారి లేక గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. ఆ మట్టి రోడ్డు కాస్తా పట్టించుకునే వారు లేక గుంతలమయమైంది. స్థానిక నేతలకు అయినా, అధికారులకైనా మట్టి రోడ్డు పై దృష్టి పడలేదు. రెండు మండలాలు, నాలుగు తండాలకు చెందిన ప్రజలు నిత్యం ఇదేమట్టిదారి గుండా బురుగుమడ్ల రెడ్లవాడ మధ్య గిరిజనులు ప్రయాణిస్తుంటారు. వర్షాకాలంలో అయితే ఈ రోడ్డు పై ప్రయాణం నరకమే. మోకాలు లోతు గుంతలు.. అడుగు తీసి వేసేలోపే జర్రున జారేలా బురద.

వెరసి తండాలకు వెళ్లే రోడ్లు నరకం చూపిస్తున్నాయి. చిన్నపాటి వర్షానికి రోడ్లు బురదమయం కావడంతో వాహనాలు అదుపు తప్పుతున్నాయి. తండాలు గ్రామపంచాయతీలుగా మారినా సౌకర్యాల కల్పన పై పట్టింపు కరువైంది. చినుకు పడితే చిత్తడిగా మారే రోడ్లపైనే బయట ప్రాంతాలకు.. పొలాలకు జారుతూ.. పడుతూ వెళ్తున్నారు గిరిజనులు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాల మీదకు వచ్చి నా అంబులెన్స్ సైతం రాలేని దుస్థితి. పింఛన్ల కోసం పక్క గ్రామాలకు వెళ్లాలంటే వృద్ధులు వికలాంగులు నానా అవస్థలు పడుతున్నారు. పిల్లలు చదువుకోవడానికి పక్క గ్రామాలకు వెళ్లాలంటే వెళ్లలేని పరిస్థితి ఇదీ మూడు నియోజకవర్గాలకు మూలన ఉన్న గిరిజన తండాలకు వెళ్లే‘దారి'ద్య్రం. నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్ నియోజకవర్గాలకు మూలన ఉన్న తండాలను పట్టించుకునే ఎమ్మెల్యే లేడని ఓట్ల కోసం మాత్రమే వచ్చినప్పుడు కనిపించే నాయకులు గిరిజనుల సమస్యల పై దృష్టి సారించలేకపోతున్నారని స్థానికులు వాపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed