Model Market : బురదమయంగా లక్ష్మీపురం మార్కెట్‌..నీరుగారిన లక్ష్యం!

by Aamani |
Model Market : బురదమయంగా లక్ష్మీపురం మార్కెట్‌..నీరుగారిన లక్ష్యం!
X

దిశ,వరంగల్‌ టౌన్ : మోడల్‌ కూరగాయల మార్కెట్‌.. కోట్లాది రూపాయలు బురదపాలే. అడుగు తీసి అడుగు వేస్తే మడుగును తలపిస్తోంది. సాధారణ రోజుల్లోనే మార్కెట్‌లో చెత్తాచెదారం గత్తర లేపుతుంది. ఇక వర్షాకాలం.. వరుసగా వానలు పడితే, వరద నీటితో ఒళ్ళు కంపరం పుట్టేలా తయారవుతోంది. ఆ బురదలోనే రైతులు తమ సరుకులను దింపి వ్యాపారులకు విక్రయిస్తారు. ఆ బురదలోనే చిల్లర వ్యాపారులు అమ్మకాలు జరుపుతుంటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంతో వినియోగదారులు కళ్లు మూసుకుని కాళ్లు జాగ్రత్తగా కదుపుతూ కూరగాయలు కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.


ఎందుకీ పరిస్థితి!

కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన మోడల్‌ మార్కెట్‌లో కొత్త భవనాలు అయితే నిర్మించారు కానీ, డ్రెయినేజీ వ్యవస్థపై అటు కాంట్రాక్టర్‌, ఇటు పాలకులు, అధికారులు దృష్టిసారించలేకపోయారు. మోడల్‌ మార్కెట్‌ అంటూ ప్రగల్భాలు పలికి చివరకు బురద మార్కెట్‌గా నిలిపారు. డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు నీరు వెళ్లే దారి లేక మొత్తం బురదగా మారి అద్వానంగా తయారైంది. మార్కెట్‌ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా మురుగు నీటి వ్యవస్థను పట్టించుకునే వారే లేరు.


నీరుగారిన లక్ష్యం!

అసలు మోడల్‌ మార్కెట్‌ లక్ష్యం వేరే. కానీ, గత ఎమ్మెల్యే, కార్పొరేటర్ల తీరుతో అసలు ఉద్దేశం పక్కదారి పట్టింది. వాస్తవానికి వినియోగదారుల సౌలభ్యం కోసం మార్కెట్‌లో షెడ్డు నిర్మించి, అందులో గద్దెలు ఏర్పాటు చేశారు. వాటిపైనే చిల్లర వ్యాపారం నిర్వహించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ మేరకు వ్యాపారులకు గద్దెలు కేటాయించారు. కానీ, అప్పటి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ తన పలుకుబడితో తన అనుయాయులకో, లేదా ఓటు బ్యాంకు కోసమో మార్కెట్‌ యార్డు ఖాళీ స్థలంలో ప్లాట్లు విభజించి ‘చిల్లర’ వ్యాపారాలను ప్రోత్సహించారు. దీనికి అప్పటి మార్కెట్‌ ఉన్నతశ్రేణి కార్యదర్శి రాహుల్‌ సైతం వంతపాడినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై షెడ్డులో గద్దెలు పొందిన వ్యాపారులు కూడా పలుమార్లు ఆందోళనలు చేపట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. అప్పటి ఎమ్మెల్యే, మార్కెట్‌ అధికారులకు వినతిపత్రాలు సైతం అందజేశారు.

అంతేకాకుండా, ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన ప్లాట్లకు నెలవారీ అద్దె రూ.400, రూ.600, రూ.800గా ఉండగా, గద్దెల అద్దె రూ.2,300గా నిర్ణయించారు. దీంతో చాలామంది తక్కువ అద్దెలకే మొగ్గు చూపి, ప్లాట్లలోనే విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక గద్దెల అద్దె సుమారు మూడు సంవత్సరాలుగా కట్టకపోవడంతో మార్కెట్ కు ఇప్పటివరకు రూ. కోటి రూపాయలకు పైగానే పెండింగ్‌లో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్లాట్ల వల్ల తాము గద్దెల వద్ద వ్యాపారం చేయలేకపోతున్నామని వ్యాపారులు ఇప్పటికీ నిరసన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. షెడ్డు 158 మంది గద్దెలు ఏర్పాటు చేశారు అధికారులు.కానీ అందులో అసలైన వ్యాపారులు 20,30 మంది ఉండగా మిగిలిన వారందరూ బినామీ లేదని తెలుస్తోంది.కాగా మొత్తానికి లక్ష్మీపురం మార్కెట్‌ అసలు లక్ష్యానికి దూరంగా అధ్వానంగా మారిపోయిందనడానికి ఇప్పుడున్న పరిస్థితులే నిదర్శనం.


మంత్రి సురేఖ చేతిలోనే..!

అసలు మోడల్‌ మార్కెట్‌ నిర్మాణానికి బీజం పడిరది అప్పటి మంత్రి కొండా సురేఖ హయాంలోనే. అనంతర కాలంలో చోటుచేసుకున్న రాజకీయాలతో మార్కెట్‌ నిర్మాణం చేతులు మారినా... ఇప్పుడు మళ్లీ ఆమె పరిధిలోనే ఉండటం గమనార్హం. తాజాగా మంత్రిగా ఉన్న సురేఖ.. మార్కెట్‌ను తీర్చిదిద్దాలని ప్రజలు కోరుకుంటున్నారు.



Next Story