విద్యారంగాన్ని విస్మరిస్తే ప్రభుత్వ పతనం తప్పదు..: ఏఐఎస్ఎఫ్

by Aamani |
విద్యారంగాన్ని విస్మరిస్తే ప్రభుత్వ పతనం తప్పదు..: ఏఐఎస్ఎఫ్
X

దిశ,హనుమకొండ : రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రూ. 6,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని, ఎఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్, భాషా బోయిన సంతోష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్ నుండి 3000 మంది విద్యార్థులు భారీ ర్యాలీ తో హన్మకొండ కలెక్టరేట్ ను ముట్టడించి గంటసేపు ధర్నా నిర్వహించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ కార్యాలయంలో అందించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్, బోయిన సంతోష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కార్ విద్యారంగ అభివృద్ధిని పూర్తిగా విస్మరించడం వలన వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్ మెంట్ పై ఆధారపడి చదివే విద్యార్థుల పరిస్థితి కడు దయనీయంగా మారి ఉన్నత చదువులకు దూరం కావాల్సిన పరిస్థితి రాష్ట్ర విద్యార్థి లోకానికి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ విద్యార్థుల పట్ల, విద్య రంగ అభివృద్ధి పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే స్కాలర్షిప్, ఫీజు మెంబర్స్ మెంట్, హాస్టల్ విద్యార్థుల మిస్ కాస్మోటిక్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

లేకపోతే గత బిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే నేటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పడుతుందని, విద్యారంగం పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్, కుక్కల కుమార్, జక్కుల భాను ప్రసాద్, జిల్లా సమితి సభ్యులు శ్రీపతి వినయ్, కుంటి వేణు, శ్రీనివాస్, జిల్లా నాయకులతో పాటు 3000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story