మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి రావాలని సీఎంకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

by Mahesh |   ( Updated:2024-09-15 15:19:36.0  )
మెడికల్ కాలేజీ  ప్రారంభోత్సవానికి రావాలని  సీఎంకి లేఖ రాసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: న‌ర్సంపేట మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజ‌రుకావాల‌ని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శన్‌రెడ్డి కోరారు. న‌ర్సంపేటలో అభివృద్ధికి ప్రగ‌తి బాట‌లు వేయాల‌ని కోరుతూ సీఎంకు ఆయన బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు. త్వర‌లోనే న‌ర్సంపేట మెడిక‌ల్ కాలేజీని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజ‌రుకావాల‌ని పెద్ది తన లేఖ‌లో కోర‌డం గ‌మ‌నార్హం. అనంత‌రం ఆయ‌న న‌ర్సంపేట‌లో విలేకరుల‌తో మాట్లాడారు. నాటి ఎమ్మెల్యేగా నేను స్వప్నించిన నర్సంపేట నేడు ప్రజల కళ్లముందు సాక్షాత్కరించాలంటే, నాటి పనులన్నీ ప్రగతి పథంలో నడవాలంటే, సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు. నర్సంపేట వాస్తవ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త దొడ్డ మోహన్ రావు ఆసుపత్రి నిర్మాణానికి భూమిని అందించి విశేషమైన కృషి చేశార‌ని అన్నారు. వారిని కూడా మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి ఆహ్వానించి సరైన గౌరవాన్ని ఇవ్వాలని కోరుతున్నామ‌ని అన్నారు.

రాజ‌కీయ‌ల‌కు అతీతంగా స‌హ‌కారం..!

న‌ర్సంపేట అభివృద్ధికి రాజ‌కీయాల‌కు అతీతంగా ఈ ప్రభుత్వానికి స‌హ‌క‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. మీ రాక‌తోనైనా న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గానికి ప్రగ‌తి బాట‌లు ప‌డ‌తాయ‌ని ఆశిస్తున్నానంటూ పేర్కొన్నారు. ఉద్యమ కాలం నుంచి త‌న‌తో ప‌నిచేస్తున్న అనుబంధంతోనే రాష్ట్రంలో ఎక్కడా లేన‌విధంగా కేసీఆర్ ఓ నియోజ‌క‌వ‌ర్గ కేంద్రమైన‌ న‌ర్సంపేట‌కు మెడిక‌ల్ కాలేజీని మంజూరు చేశార‌ని గుర్తు చేశారు. వరంగల్ జిల్లాకు కేటాయించబడిన మెడికల్ కళాశాలను నర్సంపేట పట్టణంలో నిర్మించి అనుమతులను ఇవ్వటం జరిగింద‌న్నారు. జిల్లా దవాఖానా సైతం పూర్తి చేయటం జరిగింద‌న్నారు. ఇటీవల నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) ఈ సంవత్సరం 50 అడ్మీషన్లతో కూడిన అనుమతులు ఇవ్వడం శుభసూచకమ‌న్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు విద్యాపరంగా అత్యంత గౌరవాన్ని తెచ్చిపెట్టింద‌ని అన్నారు. రూ.100 కోట్లతో అన్ని వసతులతో ఆసుపత్రి నిర్మాణం, 50 అడ్మిషన్లతో, అన్ని వసతులతో కూడిన మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తి చేయడం జరిగింద‌న్నారు.

మెడికల్ కళాశాలకు సంబందించి భవిష్యత్‌లో 150 అడ్మిష‌న్ల‌కు పెంపు చేసుకునే అవకాశం ఉంటుంద‌న్నారు. పీజీ కళాశాల కూడా రావాల్సి ఉంటుంద‌న్నారు. మెడికల్ కళాశాల ప్రణాళికలో భాగంగా నర్సింగ్ కళాశాల మంజూరు కూడా చేయడం జరిగింది. నర్సింగ్ కళాశాల కు శాశ్వత బిల్డింగ్ ప్రొఫెసర్లు, అసోసియేటెడ్ ప్రొఫెసర్లు, సహాయ సిబ్బంది సంబందించిన రెసిడెన్సియల్ భవనాలు, జరగబోయేటువంటి సీట్ల పెంపున‌కు రెసిడెన్సియల్ హాస్టల్స్, లాబ్స్ తో పాటు ఇతర వసతుల కోసం కేసీఆర్ గారి ప్రభుత్వంలో జీవో -83 ద్వారా మరో 183 కోట్లు మంజూరు చేసి ఉంద‌న్నారు. ముఖ్యమంత్రి హోదాలో మీరు నర్సంపేటకు వచ్చి మీ చేతుల మీదుగా మెడికల్ కళాశాల ప్రారంభించ‌డం ద్వారా నర్సంపేట అభివృద్ధికి కావాల్సిన డిమాండ్ లు నెరవేరుతాయనే ఆశాభావం ప్ర‌జ‌ల్లో నెల‌కొంద‌ని అన్నారు.

Advertisement

Next Story