దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ జంట అరెస్టు..

by Nagam Mallesh |
దేశవ్యాప్తంగా కోట్లు కొల్లగొట్టిన సైబర్‌ జంట అరెస్టు..
X

దిశ, హనుమకొండ : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందిస్తామని మోసానికి పాల్పడుతూ అన్‌లైన్‌లో దేశ వ్యాప్తంగా ప్రజల నుండి కోట్ల రూపాయలను కొల్లగొట్టిన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక మహిళతో సహా ఇద్దరు సైబర్‌ నేరగాళ్ళను అరెస్ట్ చేశారు. వీరిని సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో పని చేస్తూన్న వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ సైబర్‌ విభాగం పోలీసులు సొమవారం అరెస్టు చేసారు. వీరి నుండి పోలీసులు చెక్కు బుక్కులు, క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, పెన్‌ డ్రైవ్‌లను, సెల్ ఫోన్ల ను స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా వివరాలను వెల్లడిస్తూ తమిళనాడు రాష్ట్రం తాంబరం పట్టణానికి చెందిన జసిల్‌ (38), ప్రీతి (32) ఈ ఇద్దరు సైబర్‌ నిందితులు. కొద్ది కాలంగా పెట్టిన పెట్టుబడికి ఎక్కువ డబ్బులు తిరిగి వస్తాయని తప్పుడు ప్రచారంతో గోల్డ్‌మ్యాన్‌ సచ్‌, యాం బ్రాండింగ్స్‌ అనే తప్పుడు వెబ్‌సైట్లలో ప్రజలతో భారీ మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టించారు. ఇలాంటి పెట్టుబడుల కోసం నిందితులు రెండు ప్రవైయిట్‌ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ఈ ఖాతాల్లో జమయిన డబ్బును విత్‌ డ్రా చేసి ఈ సైబర్‌ జంట జల్సాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేసేవారు. ఇదే రీతిలో హనుమకొండకు చెందిన ఒక వ్యక్తి ఈ సైబర్‌ నేరగాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మి వీరు సూచించిన నకిలీ వెబ్‌ సైట్లలో సూమారు 28 లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టి మోసపోయినట్లుగా గుర్తించాడు. దీంతో వరంగల్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగం పోలీసులను అశ్రయించడంతో పోలీస్‌ కమిషనర్‌ అదేశాల మేరకు సైబర్‌ క్రైం ఏసీపీ విజయ్‌కుమార్‌ అధ్వర్యంలో దర్యాప్తు చేపట్టిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు టెక్నాలజీ అధారంగా నిందితులను గుర్తించి చెన్నైలోని సలయూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అరెస్టు చేసి స్థానిక జిల్లాలో కోర్టులో హజర్‌పరిచారు. అనంతరం సైబర్‌ విభాగం పోలీసులు నిందితులను సోమవారం ఉదయం వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు తీసుకవచ్చారు. అరెస్టు చేసిన నిందితులను పోలీసులు విచారించగా నిందితులు వరంగల్‌ కమిషనరెట్‌ పరిధిలో రెండు సైబర్‌ నేరాలకు పాల్పడినట్లుగా అంగీకరించడంతో పాటు, దేశ వ్యాప్తంగా సూమారు 150కి పైగా సైబర్‌ నేరాలకు పాల్పడి ప్రజలను మోసం చేసినట్టు తెలిపారు. 15 నేరాల్లో మూడు కోట్లకు పైగా డబ్బు వసూళ్ళు చేసినట్లు నేరస్థులు అంగీకరించారు. ఈ సందర్బంగా ఈ సైబర్‌ నేరస్థుల జంటను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సైబర్‌ క్రైమ్స్‌ ఏసీపీ విజయ్ కుమార్, ఇన్స్‌స్పెక్టర్‌ రవికుమార్‌, ఎస్‌.ఐలు చరణ్‌కుమార్‌, శివకుమార్‌, ఏఏఓ సల్మాన్‌పాషా, కానిస్టేబుళ్ళు రాజు, ఆంజనేయులు, దినేష్‌, అనూషలను పోలీస్‌ కమిషనర్‌ అభినందించారు. ఈ మీడియా సమావేశంలో అదనపు డీసీపీ రవి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed