అయ్యా నేను బ్రతికే ఉన్నాను..నా పై నకిలీ పత్రాలు సృష్టించారు..

by Aamani |
అయ్యా నేను బ్రతికే ఉన్నాను..నా పై నకిలీ పత్రాలు సృష్టించారు..
X

దిశ, పర్వతగిరి: నేను బ్రతికి ఉండగానే చనిపోయినట్లుగా చిత్రీకరించి నా పేరు పై ఉన్న భూమిని వేరే వాళ్ళ పేరుపై పట్టా మార్పిడి చేశారని ఎర్రం మల్లయ్య అనే వ్యక్తి మీడియాను ఆశ్రయించిన ఘటన పర్వతగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండలంలోని వడ్లకొండ గ్రామానికి చెందిన ఎర్రం మల్లయ్యకు సర్వే నె. 185/7/1 విస్తీర్ణం ఎకరం 25 గుంటల వ్యవసాయ భూమి ఉందని గతంలో తీసుకున్న క్రాప్ లోన్ కు సంబంధించిన రుణమాఫీ కాలేదని.. ఇటీవల ప్రధాని మోదీ ప్రకటించిన రైతులకు ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం డబ్బులు అందరికీ వచ్చాయి.మాకు రాలేదని స్థానిక బ్యాంకు అధికారులను, వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే.. నీ పేరు పైన భూమి లేదు మీ భూమిని ఎవరికో అమ్మావు బ్యాంకులో తీసుకున్న క్రాప్ లోన్ డబ్బులు కట్టాల్సిందని బ్యాంకు అధికారులు.... వేరే వారికి పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని వ్యవసాయ అధికారులు తెలపడంతో కంగుతిన్న రైతు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసి ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం తెలుసుకొని మీడియా ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడు.

నేను ఎవరికీ భూమి అమ్మలేదు: ఎర్రం మల్లయ్య

వంశపారపర్యంగా నాకు మా తండ్రి కొమురయ్య నుంచి 28 సంవత్సరాల క్రితం ఒక ఎకరం ఇరవై అయిదు గుంటల భూమి వచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు ఆ భూమిలో వ్యవసాయం మేమే సాగు చేసుకుంటూ వచ్చాము. మేము ఎవరికీ భూమి అమ్మలేదు. మా బ్రతుకు జీవనం పోషణ ఈ భూమి పైనే ఆధారపడింది..మా తదనంతరం మా పిల్లలకు భూమి ఉంటుందనే ఆలోచనతో భూమిని ఎవరికి అమ్మకుండా గోర్లను కాసుకుంటు జీవనం సాగిస్తున్నాము. అలాంటి మా కుటుంబం పై మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు... నేను చనిపోయానని తప్పుడు పత్రాలు సృష్టించి మాకు అన్యాయం చేద్దామనుకునే వారికి సహకరించిన గత ఎమ్మార్వో కోమి, సాక్షులుగా సంతకాలు పెట్టిన వారిపై రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు కొనుగోలు చేసిన వారిపై పోలీసులు రెవెన్యూ అధికారులు చట్టరీత్యా చర్య తీసుకోవాలని వేడుకుంటున్నా.

ఎమ్మార్వో కొమిపై పలు ఆరోపణలు..

గతంలో పర్వతగిరి మండల ఎమ్మార్వోగా కొమ్మి విధులు నిర్వహించిన సమయంలో ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చాలా జరిగినయని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఒక వ్యక్తి బ్రతికుండగానే మరణించాడని నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించి, మరియు అతని పాస్ బుక్ బ్యాంకు పెట్టి క్రాప్ లోన్ తీసుకున్న అదేమి పట్టించుకోకుండా అతను మరణించాడని హెడ్ సర్టిఫికెట్ సృష్టితో ఇంకొకరిపై భూమి బదిలీ చేయడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి రిజిస్ట్రేషన్లు మరెన్నో జరిగాయని కొమిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పర్వతగిరి మండలంలో కోమి ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన సమయంలో ఎన్ని భూ రిజిస్ట్రేషన్ చేశారు వాటన్నిటిపై ఎంక్వయిరీ వేసి ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు తీసుకోవాలని సదరు అధికారులను ప్రజలు వేరుకుంటున్నారు.

సమస్య మా దృష్టికి వచ్చింది: ఎమ్మార్వో వెంకటస్వామి

బాధిత రైతులు జిల్లా కలెక్టర్ ను కలవడం జరిగింది. అక్కడి నుంచి మాకు పూర్తి విచారణ చేసి నివేదిక పంపించమని తెలిపారు. రెండు రోజుల్లో పూర్తి విచారణ చేసి నివేదిక సమర్పిస్తాము. దోషులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోక తప్పదు. బ్యాంకులో పాస్ బుక్ ఉన్న తర్వాత భూమిని రిజిస్ట్రేషన్ చేయడం సాధ్యం కాదు. బ్యాంకు లావాదేవీలు రెవెన్యూ రికార్డులు చూపిస్తాయి. ఎలా మార్పులు చేర్పులు జరిగాయి అనేది విచారణ చేస్తాం.

Advertisement

Next Story

Most Viewed