J&K: జమ్మూకశ్మీర్‌లో మూడు ర్యాలీల్లో ప్రసంగించనున్న అమిత్ షా

by S Gopi |
J&K: జమ్మూకశ్మీర్‌లో మూడు ర్యాలీల్లో ప్రసంగించనున్న అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. శనివారం దోడాలో ప్రధాని నరేంద్ర మోడీ ర్యాలీ తరువాత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ ప్రాంతంలో మూడు ర్యాలీలలో పాల్గొని ప్రసంగించనున్నారు. సోమవారం రాంబన్, కిష్త్‌వాడ్, పాడ్డర్‌లలో మూడు ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారని బీజేపీ అధికార ప్రతినిధి, మీడియా సెంటర్ ఇంచార్జ్ అరుణ్ కుమార్ గుప్తా తెలిపారు. జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా ప్రజల నుంచి బీజేపీకి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ నాయకత్వంలో శాంతి, అభివృద్ధి, శ్రేయస్సు కోసం గత పదేళ్లలో తీసుకున్న విప్లవాత్మక చర్యల ఆధారంగా బీజేపీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ప్రజా సంక్షేమంపై దృష్టి సారించి సమగ్ర మేనిఫెస్టోను అందించిన ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. పార్టీ తన అభివృద్ధి ఎజెండాతో ప్రజలకు చేరువవుతోందని, ఇతర పార్టీలు జమ్మూకాశ్మీర్‌ను అశాంతి, అల్లకల్లోల యుగంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఖాళీ వాగ్దానాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌, కాంగ్రెస్‌, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ)లకు జమ్మూకశ్మీర్‌ ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వెల్లడించారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో అమిత్ షాకు ఇది రెండో పర్యటన కావడం గమనార్హం. అంతకుముందు, రెండు రోజుల పాటు జమ్మూలో పర్యటించారు. పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేయడమే కాకుండా జమ్మూ నగరంలో పార్టీ కార్యకర్తల భారీ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు.

Advertisement

Next Story

Most Viewed