అవినీతిలో ఇద్దరు మీ చుట్టాలు.. ఒక్కరు ఆంధ్ర కాంట్రాక్టర్!.. బీజేఎల్పీ నేత సంచలన ఆరోపణలు

by Ramesh Goud |
అవినీతిలో ఇద్దరు మీ చుట్టాలు.. ఒక్కరు ఆంధ్ర కాంట్రాక్టర్!.. బీజేఎల్పీ నేత సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో 11 మంది దొంగలతో రేవంత్ బాబా పాలన కొనసాగుతోందని, పట్ట పగలే దొంగలు దొంగలు ఉర్లు పంచుకున్నట్టు ప్రజా సొమ్మను దోచుకుంటున్నారని, గ్లోబల్ టెండర్లు రద్దు చేయకపోతే ఉద్యమం చేస్తామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి చీకటి ఒప్పందాలు చేస్తూ.. అవినీతి మయం చేశారని, జవాబుదారీతనం, పారదర్శకత లేని ప్రభుత్వం నడుస్తుందని విమర్శలు చేశారు. ప్రజా దర్బార్ కనబడకుండా పోయిందని, ప్రజాపాలన పేరు మీద రాక్షస పాలన నడుస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో రేవంత్ బాబా ఆధ్వర్యంలో 11 మంది దొంగల పాలన కొనసాగుతుందని, అన్ని వ్యవస్థలలో బీ, ఆర్, యు లతో అవినీతి నిండిందని అన్నారు.

మేఘ కృషారెడ్డికి 12 వందల 70 కోట్ల 60 లక్షలు ఇచ్చారని, గతంలో మేఘ మీద మిర్రియలు, కారాలు నూరి, ఆయన్ను జైలుకు పంపిస్తా అన్న రేవంత్ రెడ్డి.. అదే మేఘ కృష్ణారెడ్డి కి 40 శాతం ఎక్కువతో టెండర్లు ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే కేంద్ర అమృత్ నిధులు గ్లోబల్ టెండర్లు లేకుండా ఇచ్చారని, ఇవే గ్లోబల్ టెండర్లు పెడితే 30 శాతం తక్కువకు చేసేందుకు చాలా కంపెనీలు ముందుకి వస్తాయని తెలిపారు. ఇందులో 12 వందల కోట్ల కుంభకోణం జరిగిందని, మీ అవినీతిని బట్టబయలు చేసి ప్రజ క్షేత్రంలో నిలబెడతామని, గ్లోబల్ టెండర్లు రద్దు చేయకుంటే మా పార్టీ పోరాటానికి సిద్దం అవుతుందని బీజేపీ నేత హెచ్చరించారు. అలాగే కవిత లిక్కర్ కేసులో మీ బామ్మర్ది మీ శృజన్ లేరా? రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. మీ అవినీతిని వదిలే ప్రసక్తే లేదని, ఈ అవినీతి టెండర్లు కేన్సిల్ చేసి, గ్లోబల్ టెండర్లు పిలవాలని, క్యాన్సిల్ చేస్తే 12 వందల కోట్లు రాష్ట్ర ఖాజానకి మిగులుతాయని తెలిపారు. ఇక రాష్ట్ర ఖజానా ను దోస్తున్న వారు సీఎం దోస్తులా? లేక రాష్ట్ర ప్రభుత్వ ఆస్థాన గుత్తేదారూలా? అని నిలదీశారు.

ఈ అవినీతిలో ఇద్దరు మీ చుట్టాలు ఉంటే.. ఒక్కరూ ఆంధ్ర కాంట్రాక్టర్(మేఘ) ఉన్నారని, దీనిపై సీఎం సమాధానం చెప్పకుంటే వదిలే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వారం రోజుల్లో టెండర్లు కేన్సిల్ చేయకుంటే ఉద్యమాన్ని ఉదృతం చేసి ఆందోళన చేపడతామని అన్నారు. సీఎం సొంత నియోజకవర్గానికి అలొకేట్ చేసిన 4వేల కోట్లు మేఘ కృష్ణారెడ్డి కి గిఫ్ట్ ఇచ్చారని, దాన్ని ప్రస్తుతం మేఘ కంపెనీ డిజైన్ చేస్తున్నారని అన్నారు. దీని కోసం ఒక మంత్రి రాఘవ కంపెనీ, సీఎం తమ్ముడి కంపెనీ అయిన కేఎన్ఆర్ పోటీలో ఉన్నాయని తెలిపారు. పట్ట పగలే దొంగలు దొంగలు ఉర్లు పంచుకున్నట్టు ప్రజా సొమ్మను దోచుకుంటున్నారని విమర్శించారు. రేపు కొడంగల్ ఎత్తిపోతల పథకం కాంట్రాక్టు ను కూడా గ్లోబల్ టెండర్ వేయాల్సిందేనని అన్నారు. నిన్న బీజేఎల్పీ మీటింగ్ లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించామని, మరో రెండు రోజుల్లో బీజేఎల్పీ మరొక్కసారి సమావేశం అవుతుందని, ఇన్ని రోజులు నేను చేసిన ఆరోపణలు అన్నింటి మీద బీజేఎల్పీలో చర్చించి పోరాటానికి సిద్ధం అవుతామని ఏలేటి స్పష్టం చేశారు.



Next Story