రాష్ట్రంలో ఐదు మండలాలకు ఒక ఇంజనీర్ లేడు: మంత్రి కోమటిరెడ్డి

by Mahesh |
రాష్ట్రంలో ఐదు మండలాలకు ఒక ఇంజనీర్ లేడు: మంత్రి కోమటిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఐదు మండలాలకు ఒక ఇంజనీర్ కూడా లేరని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వాపోయారు. అయితే, ఆర్ అండ్ బీ శాఖకు 156 మంది ఇంజనీర్లు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖకు వచ్చిండ్రని చెప్పారు. వారందరికీ 8 రోజులుగా ట్రైనింగ్ ఇచ్చినమని.. ఇవ్వాల సీఎం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్డర్ కాపీలను ఇస్తున్నట్టు గుర్తు చేశారు. నూతనంగా ఎంపికైన ఇంజనీర్లకు ఆదివారం శిల్పా కళావేదికలో… ప్రభుత్వం ఆర్డర్ కాపీలు అందించిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. తమది ప్రజా ప్రభుత్వం అని, అందరికీ అందుబాటులో ఉంటుందన్నారు. నిరుద్యోగులు, యువత పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామన్నారు. 2022 లో నోటిఫికేషన్ వేస్తే.. గత ప్రభుత్వం పట్టించుకోక పోతే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క సమస్యను పరిష్కరించి ఇంజినీర్స్ ఆర్డర్స్ అందిస్తున్నట్టు వెల్లడించారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఉద్యోగాలు నింపుతామన్నారు.

అంతేకాదు, యువతను స్కిల్డ్ ఫోర్స్ గా మార్చి వారికి మెరుగైన భవిష్యత్తును అందిస్తామన్నారు. ఇంజనీర్లంటే రోడ్లేసి, కాలువలు తవ్వి, బిల్డింగ్ లు కట్టేవారు మాత్రమే కాదని… క్వాలిటీతో ప్రజాధనానికి కాపలాగా ఉండే వారే అసలైన ఇంజనీర్లన్నారు. వారంతా మోక్షగుండం విశ్వశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలని, కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదన్నారు. కాళేశ్వరం కట్టకముందు అంతా నాదేనని వ్యాఖ్యానించిన మాజీ ముఖ్యమంత్రి, ప్రాజెక్టు కూలి పోగానే.. విద్రోహ చర్య అన్నారు. విద్రోహ చర్య అయితే పైకిపోవాలి కానీ.. కిందకు ఎలా పోయిందన్నారు. ఆయన మోసం బయట పడే సరికి.. ప్రజల్ని మోసగించేందుకు నానా ప్రయత్నాలు చేసిండన్నారు. అనవసరంగా తెలంగాణ ప్రజలపై లక్షన్నర కోట్ల భారం వేసిండన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పదేండ్లలో పది సార్లు కూడా సెక్రెటరైట్ కు రాలేదని, కానీ మన ముఖ్యమంత్రి ప్రతీరోజు సెక్రెటరేట్ కు వస్తున్నడన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నరన్నారు.

వారంతా ఆనాటి మాటల ప్రభుత్వానికి... ఇప్పుడు పనిచేసే తమ ప్రభుత్వానికి మధ్య తేడాను గమనించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని, అందరికీ ఉద్యోగాలు వచ్చినయన్నారు. లేదంటే ఐదేండ్లు అయిన ఉద్యోగాలు రాకపోయేవన్నారు. రేపు పొద్దున ప్రతిపక్ష నాయకులు తాము ఉద్యోగాలు వేస్తే.. మీరచ్చి ఆర్డర్ కాపీలు ఇచ్చారని ట్విట్లు పెడతారన్నారు. చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించి రెండండ్ల నుంచి ఆర్డర్ కాపీలు మీరెందుకు ఇవ్వలేదని వారిని ఇంజినీర్లు ప్రశ్నించాలని కోమటిరెడ్డి కోరారు. ఇంజనీర్లు ఎస్ఈలు, ఈఈలు, డీఈలు కంటే కొత్తగా బాధ్యత తీసుకున్న వారి మీదే పెద్ద బాధ్యత ఉంటుందన్నారు. వారంతా కాంట్రాక్టర్, సూపర్ వైజర్ మీద బాధ్యత వదిలివేయంకుండా పనులు నాణ్యంగా జరుగుతున్నయా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలన్నారు. దేశాన్ని నడిపించేది ఇంజనీర్లేనని. ఇంజనీర్లు విమనాలు తయారు చేస్తరని, నడిపిస్తరని, రైళ్లు తయారు చేస్తరని, నడిపిస్తరని, రోడ్లేస్తరని, బ్రిడ్జీలు కడతరని, ప్రాజెక్టులు కడతరేని, కాలువలు నిర్మిస్తారని.. ప్రతీచోట ఇంజనీరు ఉంటారని, ఇంజనీర్లు దేశానికి వెన్నముకలంటూ ఇంజనీర్లు లేని సమాజాన్ని ఊహించుకోలేమన్నారు.

హైదరాబాద్ కు వరదలు వచ్చినప్పుడు నిజాం నవాబు.. మోక్షగుండం విశ్వశ్వరయ్య అనే ఇంజనీర్ ను పిలిపిస్తే ఆనాడు హైదరబాద్ కు ప్రమాదంగా మారిన మూసీ ఉపనది ఈసాకి అడ్డంగా గండిపేట వంటి రిజర్వయర్ ను కట్టి హైదరాబాద్ ను రక్షించిండన్నారు. వికారాబాద్ లో పుట్టి దామెరచర్లలో కృష్ణానదిలో కలిసే ఒరిజినల్ నది మన మూసీ నది అని… అది ఇవ్వాల మురికికూపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ప్రజలు క్యాన్సర్, లంగ్, వాటర్ బూన్ డిసీజెస్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు సబర్మతి నది చూసొచ్చానని, సబర్మతి నీళ్లు తియ్యగా ఉన్నాయని, అక్కడ మోడీ సబర్మతి, నమామి గంగా అని అన్ని నదుల్ని క్లీన్ చేసుకుంటుంటే... ఇక్కడి బీజేపీ నాయకులు మూసీని ముట్టుకుంటే ఊరుకునేది లేదని స్టేట్మెంట్లిస్తున్నరన్నారు.

Advertisement

Next Story

Most Viewed