Global AI Summit: దేశంలోనే తొలిసారి..రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు ప్రతిష్టాత్మక సదస్సు

by Prasad Jukanti |   ( Updated:2024-09-04 15:02:15.0  )
Global AI Summit: దేశంలోనే తొలిసారి..రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేపు ప్రతిష్టాత్మక సదస్సు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రాన్ని ఏఐ హబ్ గా తీర్చిదిద్దటంతో పాటు 2030 నాటికి హైదరాబాద్ ను ఐటీలో బెంగళూరును అధిగమించడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమ నిర్వహణకు సిద్ధమైంది. గురువారం గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారు. 'మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీ వన్' అనే థీమ్ తో రేపు, ఎల్లుండి హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. దేశంలోనే మొదటి సారి నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కు ప్రపంచం నలుమూలల నుంచి ఏఐ రంగంలో పేరు పొందిన ప్రముఖులు, వివిధ సంస్థలకు చెందిన 200 మంది ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. ఏఐ రంగంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, ఐబీఎం నుంచి డానియెలా కాంబ్, x ప్రైజ్ ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా..

ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును నిర్వహిస్తోంది. హైదరాబాద్ లో నిర్మించనున్న ఫోర్త్ సిటీలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని ఏఐ హబ్ గా తీర్చి దిద్దేందుకు.. ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఇందులో భాగంగా వివిధ రంగాల్లో ఏఐ సేవలను అభివృద్ధి అవకాశాలతో.. భవిష్యత్తు కార్యాచరణతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్ ను రూపొందించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను, అందుకు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ సదస్సు ప్రపంచానికి చాటి చెపుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఇందులో భాగంగా ఈ సదస్సులో హై-ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్స్, ఇంటరాక్టివ్ సెషన్‌ లు ఏర్పాటు చేశారు. సదస్సులో పాల్గొనబోయే వారు ఏఐ రంగం అభివృద్ధికి తమ ఆలోచనలను, భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరుపుతారు. సామాజిక బాధ్యతగా సమాజంపై ఏఐ ప్రభావం, నియంత్రణ, సవాళ్లను డిస్కస్ చేస్తారు. కొత్త సాంకేతికత పరిజ్ఞానంతో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ది దశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్‌లను ఈ సందర్భంగా ప్రదర్శిచనున్నారు. రెండు రోజుల ఈవెంట్‌లో ప్రధాన వేదికతో పాటు నాలుగు అదనపు వేదికలు ఏర్పాటు చేశారు. అన్ని వేదికలపై ఏఐకి సంబంధించి వేర్వేరు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్టి సెషన్స్ నిర్వహించే ఏర్పాట్లు చేశారు.

Advertisement

Next Story

Most Viewed