R.Krishnaiah: అందుకే రాజీనామా.. జగన్ పై ఆర్.కృష్ణయ్య హాట్ కామెంట్స్

by Prasad Jukanti |
R.Krishnaiah: అందుకే రాజీనామా.. జగన్ పై ఆర్.కృష్ణయ్య హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా తర్వాత బుధవారం హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన బీసీ ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకువెళ్లే క్రమంలో మా వెనుక ఏదో రాజకీయ పార్టీ ఉందనే మచ్చ వస్తుందని.. దానిని అరికట్టేందుకే పార్టీలకు అతీతంగా ఉద్యమం చేపట్టాలని ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొంత మేర బీసీల అభివృద్ధి జరిగిందని ఇది దేశమంతటా జరగాలనేది మా డిమాండ్ అన్నారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో పాటు ఇక్కడ బీసీలు చదువునేందుకు అకాశాలు కల్పించినట్లుగా మిగతా రాష్ట్రాల్లోనూ బీసీలకు విద్యావకాశాలు మెరుగుపరచాలన్నారు. అప్పుడు మాత్రమే కులాల లోపల అన్ని రంగాల్లో సమానత్వం మొదలవుతుందన్నారు.

నా టార్గెట్ అదే:

బీసీ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా మన కులాల వారికి న్యాయం, చట్టసభల్లో రిజర్వేషన్లు దక్కాలన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అనేక మలిటెండ్ పోరాటాలు చేసి దీని ద్వారా మన హక్కులు సాధించుకున్నామని కానీ ఈసారి గాంధేయమార్గంలో శాంతియుతంగా పోరాటాలు చేస్తామన్నారు. బీసీల హక్కుల సాధన కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని. ఒక్క తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమం ఉంటే దాని ప్రభావం పక్కరాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందన్నారు. దానికోసం ఓ వైపు అనారోగ్యంతో బాధపడుతున్నా, మరో వైపు వయసురీత్యా ఇబ్బందులు ఉన్నా బీసీ ఉద్యమం కోసం పోరాటం చేస్తున్నాన్నారు. ఈ పోరాటాన్ని బలోపేతం చేసేందుకు గ్రామ, మండల, జిల్లా కమిటీలు వేయాలని బీసీల నాయకులను కోరారు. ఇప్పుడు సాధించకపోతే ఇంకెప్పుడు సాధించలేమన్నారు. చట్టసభల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించడం నా జీవిత ధేయం అని దీని కోసం ఎంత దూరమైనా వెళ్తాను, ఎంతకైనా తెగిస్తానని వారితో చెప్పానన్నారు.

పార్టీ ఏర్పాటు కోసం ఒత్తిడి ఉంది:

రాజకీయ పార్టీ పెట్టాలనే ఒత్తిడి ఉందని అయితే దానిపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ ఏర్పాటు విషయంలో మిగతా పెద్దలతో ఆలోచన చేయాల్సి ఉందన్నారు. తాను రాజీనామా చేశాక అనేక పార్టీలు తనను సంప్రదించి తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇస్తున్నాయని కానీ నేను వారి ప్రతిపాదనలను అంగీకరించలేదన్నారు. అన్నికులాల్లో పేదవారు ఉన్నారు. కానీ సాంఘిక సమానత్వం కావాలి, బీసీ కులాల్లోని పేదవారికి కనీసం గౌరవం దక్కడం లేదు. రాజకీయ అధికారం దక్కినప్పుడే వీరికి సమాజంలో గౌరవం దక్కుతుంది. ఊరువాడ ఏకమై ఎరకంగా తెలంగాణ సాధించామో అదే రకంగా బీసీలంతే ఏకం కావాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసి బీసీలలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు పాటుపడుతానని ప్రజలందరూ పెద్ద మనసుతో బీసీ ఉద్యమ బలోపేతానికి సహకరించాలన్నారు.

జగన్ రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు:

బీసీల కోసం తాను చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించి ఎంతో అభిమానంతో వైఎస్ జగన్ తనకు రాజ్యసభ అవకాశం కల్పిచారని చెప్పారు. బీసీ కులాలకు సామాజిక న్యాయం జరగాలనే ఉద్దేశంతో తనకీ అవకాశం ఇచ్చారన్నారు. అయితే తన ఉద్యమాన్ని రాజకీయంగా వాడుకోవాలని జగన్ చూశారని హాట్ కామెంట్స్ చేశారు. తానెప్పుడు బీసీల కోసమే ఉద్యమం చేస్తామన్నారు.

ఆర్.కృష్ణయ్యతో మల్లురవి, తీన్మార్ మల్లన్న భేటీ:రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన ఆర్.కృష్ణయ్యను కాంగ్రెస్ ఎంపీ మల్లురవి భేటీ అయ్యారు. బుధవారం ఉదయం మల్లుర్వి స్వయంగా విద్యానగర్ లోని కృష్ణయ్య నివాసానికి వెళ్లారు. అక్కడ కాసేపు వీరిరువురు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు సమాచారం. దీంతో ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అనంతరం కృష్ణయ్య మీడియా సమావేశం నిర్వహిస్తుండగా అక్కడికి తీన్మార్ మల్లన్న వచ్చారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. బీసీల డిమాండ్లు నెరవేర్చుకునే పరిస్థితులు, అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయని కృష్ణయ్యను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. ఆర్. కృష్ణయ్య తీసుకుబోయే నిర్ణయం ఏదైనా మెజార్టీ బీసీలకు ఆమోద యోగ్యంగా ఉంటుందని అనుకుంటున్నాన్నారు.

Next Story