మీ ముందున్న లక్ష్యం అదే.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశం

by Ramesh Goud |
మీ ముందున్న లక్ష్యం అదే.. అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశం
X

దిశ , తెలంగాణ బ్యూరో : రెవెన్యూ ఉద్యోగులు కష్టపడి పని చేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. రాష్ట్రంలో ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికే భూ భారతిని త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పని చేసేందుకు కొత్తగా 10,954 జీపీఓ, కొత్త డివిజ‌న్లు, మండ‌లాల‌కు 361 పోస్టులు, 33 సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ పోస్టుల‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ ఉద్యోగుల సంఘాల నాయకులు కలిశారు .

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి సమక్షంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రాములు, ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, మహిళా అధ్యక్షురాలు రాధ, తెలంగాణ రెవెన్యూ స‌ర్వీసెస్ అసోసియేష‌న్‌(టీజీఆర్ఎస్ఏ) రాష్ట్ర అధ్య‌క్ష‌కార్య‌ద‌ర్శులు బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, సీసీఎల్ఏ యూనిట్ అధ్యక్షుడు రాంబాబు, కృష్ణ చైతన్య, పూర్వ వీఆర్వో, వీఆర్ఏ సంఘాల నాయకులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ సంఘాల నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ .. ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్టుగా చెప్పారు. ఉద్యోగుల వేతనాలను నెల మొదటి వారంలోనే ఇస్తున్నామన్నారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వ శాఖలను బలోపేతం కృషి చేస్తున్నట్టుగా చెప్పారు. క్షేత్ర‌ స్థాయిలో రెవెన్యూ వ్య‌వ‌స్థ బ‌లోపేతానికి ప్ర‌భుత్వం కొత్తగా పోస్టుల మంజూరు చేసిందన్నారు. గ్రామ స్థాయిలో 10,954 గ్రామ స్థాయి ప‌రిపాల‌న అధికారులు (జీపీఓ), కొత్త డివిజ‌న్ల‌కు, మండ‌లాల‌కు 361 పోస్టుల మంజూరు, 33 సెల‌క్ష‌న్ గ్రేడ్ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌ పోస్టుల‌కు రాష్ట్ర క్యాబినేట్ ఆమోదం కూడా లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గరికె ఉపేంద్ర రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి లక్ష్మీ నరసింహులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాఘవేందర్, పూర్వ వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed