CM Revanth Reddy : దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో ముందడుగు వేయబోతోంది

by Kalyani |
CM Revanth Reddy : దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో ముందడుగు వేయబోతోంది
X

దిశ, రంగారెడ్డి బ్యూరో / వికారాబాద్ ప్రతినిధి / పరిగి: దేశ రక్షణ కోసం మిస్సైల్స్ తయారు చేసే వ్యవస్థ నుంచి అనేక వ్యవస్థలు హైదరాబాద్ లోనే ఉన్నాయని, అందుకు తెలంగాణ బిడ్డగా చాలా గర్వంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో దామగుండం ఫారెస్ట్ లో విఎల్ఎఫ్ స్టేషన్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో ముందడుగు వేయబోతోంది అన్నారు. వికారాబాద్ జిల్లా నుంచి ముఖ్యమంత్రిగా నేను, స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో దేశ రక్షణలో కీలక పాత్ర పోషించే విఎల్ఎఫ్ స్టేషన్ ప్రారంభించు కోవడం గర్వకారణం అన్నారు.

విఎల్ఎఫ్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. దీనివల్ల వచ్చే రేడియేషన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడుతుందని, స్థానిక ప్రజలకు అనేక ఇబ్బందులు వస్తాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి విఎల్ఎఫ్ 1990 సంవత్సరంలోనే తమిళనాడులో ప్రారంభించారు. 34 సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు అక్కడ ఎలాంటి నష్టం జరగలేదు. ప్రకృతి కూడా ఎక్కడ డ్యామేజ్ కాలేదు. అలాంటి 2వ దశ ఫ్రీక్వెన్సీ విఎల్ఎఫ్ వికారాబాద్ ప్రాంతానికి రావడం మన జిల్లా ప్రజలకే కాక రాష్ట్ర ప్రజలందరి అదృష్టం అన్నారు.

2017 లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే భూ బదలాయింపు జరిగింది..

2017లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే వికారాబాద్ జిల్లా, దామగుండం పరిధిలో విఎల్ఎఫ్ స్టేషన్ ఏర్పాటుకు భూ బదలాయింపు జరిగిందని పేర్కొన్నారు. అప్పుడు అన్నిటికి అంగీకరించిన వారు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు..? వివాదాలకు తెరలేపేవారు దేశ రక్షణ, దేశ భద్రత గురించి ఆలోచించాలని అన్నారు. దేశం ఉంటేనే మనం ఉంటాం, మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసే ప్రయత్నం చేసే వారికి ఈ ప్రాజెక్టుతో కనువిప్పు కలగాలి అని అన్నారు. దామగుండం ఫారెస్ట్ అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వడం కూడా గత ప్రభుత్వంలోనే చోటుచేసుకుంది. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేవీ రాడార్ స్టేషన్ ప్రాజెక్టును ప్రారంభించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్వయంగా కోరడంతో, అధికారులందరినీ పిలిచి దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం రాజీ పడకూడదని ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపామని అన్నారు.

“ పర్యావరణ రక్షకులు, పర్యావరణ ప్రేమికులు ఒకటి ఆలోచించాలి.. దేశం, దేశంలోని ప్రజలు ఉంటేనే ఈ పర్యావరణం గురించి చర్చించుకోగలుగుతాం.” దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితుల నుంచి కాపాడటానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, మనోహర్ రెడ్డి, నేవీ చీఫ్ త్రిపాటిజి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నేవీ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed