TGDRF : రెండు వేల మందితో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్.. ఉన్నతాధికారులతో సీఎస్ చర్చలు

by Ramesh N |   ( Updated:2024-10-15 12:11:20.0  )
TGDRF : రెండు వేల మందితో తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్.. ఉన్నతాధికారులతో సీఎస్ చర్చలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో సుమారు 2000వేల మందితో తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (టీజీడీఆర్ఎఫ్) ఏర్పాటు చేస్తున్నామని సీఎస్‌ శాంతి కుమారి తెలిపారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్‌, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై 'తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్' ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించారు. ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన ఘటనల నేపథ్యంలో అగ్నిమాపక శాఖకు చెందిన 10 బృందాలు, తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌లోని 10 కంపెనీలను వినియోగించి 'తెలంగాణ రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్' ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సుమారు 2000 మందితో కూడిన బలమైన బలగాలను ఏర్పాటు చేసేందుకు, అవసరమైన బడ్జెట్ కూడా సీఎం మంజూరు చేశారని సీఎస్ తెలిపారు.

వరదలు, అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తుల సమయంలో అప్రమత్తంగా ఉండేందుకు సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని ఆమె అన్నారు. వచ్చేనెల మొదటి వారం నుంచి సిబ్బందికి మొదటి బ్యాచ్ శిక్షణను ప్రారంభించాలని సీఎస్ వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్‌లకు అవసరమైన వాహనాలు, పరికరాలు, వ్యక్తిగత రక్షణ, ఇతర సాధనాల సేకరణ గురించి కూడా సమావేశంలో చర్చించారు. అవసరమైన పరికరాలు, శిక్షణ అందించడం ద్వారా అగ్నిమాపక శాఖలోని 10 బృందాలను ఎస్‌డీఆర్‌ఎఫ్ స్టేషన్‌లుగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు డీజీ ఫైర్ సర్వీసెస్ నాగిరెడ్డి తెలిపారు. టీజీఎస్పీ బెటాలియన్‌ల నుంచి మొత్తం 1000 మంది సిబ్బంది (ఒక్కో సంస్థ 100 మంది సిబ్బందితో కూడినది) అగ్నిమాపక శాఖ సిబ్బందితో సమానంగా శిక్షణ పొందుతారు. ఈ బృందాలను అత్యవసర పరిస్థితిలో సంబంధిత ప్రదేశాలలో అందుబాటులో ఉంచుతారు. శిక్షణ కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్ సేవలను వినియోగించుకుంటామని ఆయన తెలిపారు.

Next Story

Most Viewed