Srinivas Reddy: సొసైటీల్లో లేకపోయినా ఇంటి స్థలాలు వస్తాయి: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి

by Shiva |
Srinivas Reddy: సొసైటీల్లో లేకపోయినా ఇంటి స్థలాలు వస్తాయి: మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ నిబంధన మేరకు సొసైటీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలం అందుతుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే.శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా కలుకూరి రాములు పదవీ బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమాన్ని బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల గోస సీఎం చేతుల మీదుగా జవహార్ లాల్ నెహ్రూ సొసైటీకి స్థలం అప్పగింత పత్రాలతో తీరిందని అన్నారు. ఇతర జర్నలిస్టులు ఎలాంటి అనుమానాలు అపోహలకు గురికావొద్దని కోరారు. కొందరు జర్నలిస్టులు తాము ఎలాంటి హౌసింగ్ సొసైటీలలో సభ్యులుగా లేమని తమ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని అన్నారు.

నిబంధనల మేరకు వర్కింగ్ జర్నలిస్టుగా పని చేస్తున్న ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్‌తో సంబంధం లేకుండా, సొసైటీలతో సంబంధం లేకుండా దరఖాస్తులు ప్రభుత్వం స్వీకరిస్తుందని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో యూనియన్ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. గతంలో జర్నలిస్టులకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గోపనపల్లిలో ఇళ్ల స్థలాలు వచ్చాయన్న, అక్రిడేషన్ల సౌకర్యం వచ్చిందంటే అది కేవలం యూనియన్ చేసిన పోరాటాలే అని, ఇందుకు దేశోద్ధారక భవన్ వేదిక అని గతంలో చేసిన పోరాటాలను ఆయన గుర్తు చేశారు. ప్రతి జర్నలిస్టు వృత్తి ధర్మాన్ని పెంపొందించుకుంటూ సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులను ఏకం చేసి త్వరలోనే ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా సదస్సును నిర్వహిస్తామని వెల్లడించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిష్పక్షపాతంగా పోరాటాలు చేసేది టీయూడబ్ల్యూజే అన్నారు. హెచ్‌యూజే అధ్యక్షుడు శిగా శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి రాంనారాయణ, స్టీరింగ్ కమిటీ సభ్యులు మాజిద్, రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, కార్యదర్శి యాదగిరి, జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసుఫ్ బాబు, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ రెడ్డి, హెచ్ యూజే ప్రధాన కార్యదర్శి షౌకత్, యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, హరి, నాగరాజు గౌడ్, హరీష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed