ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి బృందాలు

by M.Rajitha |
ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి బృందాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఎల్బీసీ ప్రమాదంలో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్లో సింగరేణి బృందాలు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నాయి. శుక్రవారం సొరంగ మార్గంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ను సంస్థ చైర్మన్, ఎండీ ఎన్.బలరామ్, ఎన్. డీ ఆర్.ఎఫ్ కల్నల్ తో కలిసి 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో ప్రమాద స్థలి చేరువ వరకు పరిస్థితిని, సహాయక చర్యలను స్వయంగా పరిశీలించారు. సంస్థ చైర్మన్ తమతో పాటు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనడంతో సింగరేణి సిబ్బంది ఆత్మ స్థైర్యంతో పనిచేస్తున్నారు. ట్రాకు పునరుద్ధరణ జరగాలంటే దానిపై కూలిన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీ.బి.ఎం) భాగాలను తొలగించాల్సి ఉంటుంది. ఈ పనిలో సింగరేణి రెస్క్యూ సిబ్బంది తమ వద్ద గల అత్యాధునిక గ్యాస్ కటింగ్ యంత్రాల ద్వారా ఇనుప పైపులను, గడ్డర్లను కత్తిరిస్తూ వేరు చేస్తున్నారు.

సింగరేణి రెస్క్యూ బృందాల ఆధ్వర్యంలో జరుగుతున్న గ్యాస్ కటింగ్ పనులను సంస్థ ఎండీ ఎన్. బలరామ్ స్వయంగా దగ్గర ఉండి పర్యవేక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.... ఎస్.ఎల్.బి.సిలో ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకోవడం కోసం ఈ ట్రాక్ పునరుద్ధరణ అత్యవసరం కావడంతో సింగరేణి రెస్క్యూ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయన్నారు. అదే సమయంలో ట్రాక్ మీద పేరుకుని ఉన్న బురద మట్టిని కూడా రెస్క్యూ బృందాలుతొలగిస్తున్నట్టు వెల్లడించారు. మొత్తం 250 మంది సింగరేణి రెస్క్యూ సభ్యులు 24 గంటలు ఈ పనిలో పాల్గొనేందుకు వీరిని నాలుగు షిఫ్టులకు తగిన విధంగా విభజించామన్నారు.రక్షణ సూత్రాలు పాటిస్తూ పనిని సమర్థంగా పూర్తి చేయాలని సంస్థ చైర్మన్ రెస్క్యూ సిబ్బందికి సూచించారు.

మరోవైపు ఎన్జీఆర్ఐ బృందాలు వారు ప్రమాద స్థలానికి చేరుకోవడానికి భూమి తొలిచే యంత్రాల (గ్రౌండ్ పెనట్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్)ద్వారా ఐదు అనుకూల మైన ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ ప్రదేశాలలో తవ్వకాన్ని సమర్ధంగా నిర్వహించడం కోసం ఎన్డిఆర్ఎఫ్, సింగరేణి బృందాలకు పనులు విభజించామన్నారు. అలుపెరగకుండా, అంకితభావంతో రెస్క్యూ సేవలందిస్తున్న సిబ్బందిని చైర్మన్ అభినందించారు. ఇచ్చిన లక్ష్యాలను వేగంగా సాధించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రత్యక్ష పరిశీలన, పర్యవేక్షణలో జనరల్ మేనేజర్ రెస్క్యూ, శ్రీనివాసరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story