యువత ఆకాంక్షలు నెరవేరుస్తున్న రేవంత్ సర్కార్.. 10 నెలల్లోనే..

by karthikeya |
యువత ఆకాంక్షలు నెరవేరుస్తున్న రేవంత్ సర్కార్.. 10 నెలల్లోనే..
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో యువత, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదన్న అసంతృప్తి తీవ్ర స్థాయిలో వ్యక్తమైంది. పరీక్షలు జరిగినా ప్రశ్నపత్రాల లీకేజీ, కోర్టు కేసులతో నియామకాలు జరగలేదని నిరుద్యోగులు రోడ్లెక్కారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల మెనిఫెస్టోలో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్‌పై స్పష్టమైన హామీని ఇచ్చింది. ప్రత్యేకంగా యూత్ డిక్లరేషన్‌ను ప్రియాంకాగాంధీ చేతుల మీదుగా రిలీజ్ చేసింది. దీంతో అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే లీగల్ చిక్కులను పరిష్కరించి దాదాపు 40 వేల ఉద్యోగాలను కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

విద్యార్థులు, నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని సీఎం సహా పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే పలుమార్లు ప్రకటించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌పై ఉన్న అపవాదును తొలగించి పూర్తిగా ప్రక్షాళన చేశామని, అసెంబ్లీ వేదికగా ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఖాళీ పోస్టుల భర్తీ ప్రాసెస్ చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటివరకు భర్తీ చేసిన ఖాళీ పోస్టులు, రానున్న రోజుల్లో చేపట్టనున్న ప్రక్రియ గురించి ప్రభుత్వ వర్గాలు పలు అంశాలను వెల్లడించాయి. గత ప్రభుత్వం పదేండ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 7,857 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని గుర్తుచేశాయి.

కాంగ్రెస్ కేవలం పది నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించిందని, జులైలో పరీక్షలు కూడా పూర్తయ్యాయని, అంతే వేగంతో సెప్టెంబర్ 30వ తేదీన ఫలితాలను వెల్లడించిన అంశాన్ని ఉదహరించాయి. నియామకాలు నిరంతర ప్రక్రియ అంటూ ససీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో డీఎస్సీ ఫలితాలను వెల్లడిస్తున్న సందర్భంగా సోమవారం స్పష్టమైన ప్రకటన చేశారు.

  • 10 నెలల్లో నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, అపాయింట్‌మెంట్ లెటర్లు ఇలా..
  • పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 2022లో నిర్వహించిన 16,929 మంది కానిస్టేబుల్ పోస్టులకు నియామక పత్రాల అందజేత.
  • మెడికల్, హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు 2022 డిసెంబర్ లో నిర్వహించిన 7,094 మందికి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల నియామక పత్రాల అందజేత.
  • వైద్యారోగ్య శాఖలో 3,967 పోస్టుల నియామకానికి మూడు నోటిఫికేషన్లు.
  • సెప్టెంబర్ 11న 1,284 ల్యాబ్ టెక్నీషియన్, సెప్టెంబర్ 18న 2,050 నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్) పోస్టులు, సెప్టెంబర్ 24న 633 ఫార్మాసిస్ట్ (గ్రేడ్ 2) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
  • రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల పరిధిలో టీజీటీ (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్), పీజీటీ (పొస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్), జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులన్నీ కలిపి 8,304 మందికి నియామక పత్రాల పంపిణీ.
  • స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 26 నోటిఫికేషన్లతో 17,341 పోస్టుల భర్తీ వివిధ దశల్లో ఉన్నా కొందరికి ఇప్పటికే అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేత.
  • ఇరిగేషన్ విభాగంలో 687 మంది ఏఈఈలకు ఇటీవలే నియామక పత్రాల పంపిణీ.
  • గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన గ్రూప్-4 ఫలితాలను వెల్లడించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ 8,180 పోస్టుల నియామకాలకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నది.
  • సోషల్ వెల్ఫేర్ డిపార్టుమెంట్లలో 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు, 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు ఫలితాల వెల్లడి.
  • గతంలో పేపర్ లీకేజీతో కారణంగా గందరగోళంగా మారిన గ్రూప్-1 పరీక్షను కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేసి 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష జరగ్గా నెల రోజుల్లోనే (జులై 7న) ఫలితాలు వెలువడ్డాయి. అక్టోబర్ 21- 27 మధ్య మెయిన్స్ పరీక్షలకు జరగనున్నాయి.
  • షెడ్యూలు ప్రకారమే గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలను నిర్వహించేందుకు షెడ్యూలు ఖరారైంది.
Next Story