బరిలో నిలిచేదెవరు..?

by Sumithra |
బరిలో నిలిచేదెవరు..?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో : రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పై విస్తృతంగా చర్చ సాగుతుంది. అధికార పార్టీ అభ్యర్ధి ఎవరనే ప్రచారం జోరుగా సాగుతుంది. నిన్న, మొన్నటి వరకు ప్రస్తుత ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​ రెడ్డితో పాటు క్యామ మల్లేశం, కంచర్ల చంద్రశేఖర్​ రెడ్డిలు ఈ ధపా ఎన్నికల్లో పోటికి సిద్దమైతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. కానీ జనవరి 22న ప్రగతి నివేదన యాత్రను ఎమ్మెల్యే కిషన్​ రెడ్డి తనయుడు ప్రశాంత్​ రెడ్డి (బంటి) నందివనవర్తి గ్రామంలో ప్రారంభించారు. ఈ ప్రారంభానికి పోటిలో ఉంటారని భావించిన క్యామ మల్లేష్​ సైతం హాజరు కావడంతో చర్చ మరోవైపునకు మళ్లింది. ఎప్పుడైన ఎవరైన యాత్రలు చేస్తే అధికారాన్ని నిలబెట్టుకునేందుకు, మరో పదవిని ఆశించేందుకేననే ప్రచారం తప్పకుండా సాగుతుంది. అందులో భాగంగానే ప్రశాంత్​ రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్రతో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో విస్తృత చర్చ సాగుతుంది.

ఈ ఎన్నికల్లో తండ్రి తప్పుకొని తనయుడిని బరిలో నిలపనున్నారనే ప్రచారం కోడై కూస్తుంది. బీఆర్​ఎస్​ అధినేత సీఎం కేసీఆర్​ ఈ ధపా ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యత కల్పిస్తే మంచిరెడ్డి కిషన్​ రెడ్డి తనయుడిని పోటీలో నిలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రగతి నివేదన యాత్ర ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​ల ఆశ్సీసులు తీసుకున్నారు. ఈ యాత్రతో గ్రామాల్లోని సమస్యలకు తమది భరోసా అంటూ తండ్రి మద్దతుతో ముందుకు పోతున్నాడు. యాత్ర ప్రారంభ సభలో స్ధానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ప్రశాంత్​ రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించాలని, కిషన్​ రెడ్డి మద్దతు కావాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే విషయం నియోజకవర్గంలోని బీఆర్​ఎస్​ పార్టీ కమిటీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.

ఈ నివేధన యాత్రలో భాగస్వామ్యం కానీ తుర్క యంజాల్​ మున్సిపాలిటీని తండ్రి మంచిరెడ్డి కిషన్​ రెడ్డి మార్నింగ్​ వాక్​తో ముందుకుపోతున్నారు. ఈ ధపా మంచిరెడ్డి ప్రశాంత్​ రెడ్డినే బరిలో ఉంటారనే ప్రచారం ప్రగతినివేధన యాత్రతో బలపడింది. దీంతో తండ్రి, తనయుడు కలిసిపోతారా... లేక ఎవరికివారే బరిలోకి సిద్దమైతారా అనే ప్రశ్నలు లేకపోలేదు. ఈ ప్రగతి నివేధన యాత్రలో ప్రశాంత్​ రెడ్డి ఆయా గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలు అమలు జరగకపోతే మైనస్​ కాకతప్పదనే ప్రచారం కూడా ఉంది. ఇప్పటికే పాదయాత్రలో పెద్దగా ప్రజల మద్దతు లేదనే ఆరోపణలున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య జరిగే ప్రగతి నివేదన యాత్ర మంచిరెడ్డి కుటుంబానికి కలిసి వస్తుందా.. లేదా వేచిచూడాల్సిందే.

Next Story

Most Viewed