పర్యాటక అభివృద్ధిలో పేదలకు ఉపాధి అవకాశాలు కలిగి ఉండాలి

by Kalyani |
పర్యాటక అభివృద్ధిలో పేదలకు ఉపాధి అవకాశాలు కలిగి ఉండాలి
X

దిశ, ప్రతినిధి వికారాబాద్: పర్యావరణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా పేదలకు ఉపాధి అవకాశాలు కలిగేలా ఉండాలని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని స్టేట్ ఛాంబర్ లో అనంతగిరి పర్యాటక అభివృద్ధిపై చేపట్టాల్సిన పనులపై అటవీ, దేవాదాయ, మిషన్ భగీరథ, భూగర్భ జలాల, మున్సిపల్ విభాగాల అధికారులతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ లతో కలిసి శాసనసభ సభాపతి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి సభాపతి మాట్లాడుతూ.. జిల్లాలో పర్యావరణ పర్యాటక అభివృద్ధికి స్వచ్ఛ దర్శన్ పథకం కింద రూ.110 కోట్ల నిధులు మంజూరు అయ్యాయన్నారు. ఇట్టి నిధులతో 213 ఎకరాల్లో పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారని సభాపతి తెలిపారు.

పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి నిధులు వృధా చేయకుండా అవసరమైన పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ఖర్చుతో చేపడుతున్న పనులతో పేదలకు ఉపాధి కలిగేలా ఉండాలని అదేవిధంగా ఆదాయ వనరులపై నివేదిక రూపొందించాలని ఆయన సూచించారు. పర్యాటక అభివృద్ధిలో భాగంగా చెట్లను ఎక్కువగా తొలగించకుండా అభివృద్ధి పరచాలని తెలిపారు. ఏ ప్రాజెక్టులకు ఎంతెంత ఖర్చు పెడతారో స్పష్టమైన నివేదికలను అందించాలని సభాపతి సూచించారు. గతంలోనే పర్యాటక అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరైనప్పటికీ, రూ.25 కోట్లతోనే అభివృద్ధి పనులు చేశారని ఆయన తెలిపారు. పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చొరవ వల్ల కోట్ పల్లి ప్రాజెక్టులో బోటింగ్ చేయడం వల్ల పర్యాటకుల సందడి పెరిగిందని, దీనివల్ల స్థానికులకు ఉపాధితో పాటు హైదరాబాద్ నుండి వికారాబాద్ వరకు రహదారులకు ఇరువైపులా ఎన్నో హోటల్లు వెలిశాయని సభాపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యాటక ప్రాంత అభివృద్ధిలో భాగంగా స్థానికులకు పూర్తిస్థాయిలో ఉపాధి అవకాశాలు ఉండాలన్నారు. పర్యాటక ప్రాంత అభివృద్ధితో జిల్లాలోని పలు ప్రాంతాలు వృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. జిల్లాలోని అనంతగిరి ప్రాంత అభివృద్ధితో పాటు కోట్ పల్లి, సర్పన్ పల్లి, శివసాగర్, లక్నాపూర్ ప్రాజెక్టులు, దామగుండం ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పర్యావరణ పర్యాటక అభివృద్ధిలో భాగంగా చేపట్టే వివిధ పనుల వివరాలను ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ మేనేజర్ సుమతి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమీక్ష సమావేశంలో నీటిపారుదల శాఖ జిల్లా అధికారి రేణుక, ఈఈ సుందర్, అటవీ శాఖ అధికారి జ్ఞానేశ్వర్, డివైఎస్ఓ హనుమంతరావు, మత్స శాఖ అధికారి సౌజన్య, దేవాదాయ శాఖ అధికారి నరేందర్, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed