ఫిరంగి నాలా కబ్జా... హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ

by srinivas |
ఫిరంగి నాలా కబ్జా... హైడ్రాకు ఫిర్యాదుల వెల్లువ
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: సాగునీటి ప్రాజెక్టులు లేని ప్రాంతాలకు చెరువులు, కుంటలు రైతులకు జీవనాధారం. అలాంటి చెరువులు, కుంటలను కాపాడాల్సిన అధికారులు రియల్​వ్యాపారుల చేతిలో బంధీలవుతున్నారు. చెరువుల ఎఫ్టీఎల్, కుంటల ప్రవాహ హద్దులతో సంబంధం లేకుండా రియల్​ వ్యాపారులకు ఇరిగేషన్ ​అధికారులు ఎన్వోసీలు ఇచ్చారు. చేతివాటాలకు ఆలవాటు పడిన అధికారులు.. చేసిన తప్పిదాలతో సామాన్య ప్రజలు అవస్థలు ఎదుర్కొనే పరిస్థితి దాపురించింది. చెరువులు, కుంటలను నాశనం చేయడంతో భారీ వర్షాలు వచ్చినప్పుడు ఏర్పడే విపత్తులతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇరిగేషన్​ అధికారులు బాధ్యతాయుత విధుల్లో ఉండి కాసులకు కక్కుర్తిపడి సామాన్య ప్రజలతో చెలగాటం ఆడుతున్నారు. ఇదే తంతు ఈ ప్రభుత్వంలో పునరావృతం అయితే ఇక అంతే సంగతులనే ప్రచారం ఉంది. స్ధానికుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని హైడ్రా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

చరిత్ర నాలా విధ్వంసం..

ఫిరంగి నాలా రంగారెడ్డి జిల్లా రైతులకు గుండెకాయలాంటిది. ఈ నాలా రంగారెడ్డిలోని అత్యధిక చెరువులను నీటితో నింపి సాగు, తాగునీటిని సరఫరా చేస్తారు. నాలా ప్రవహించే మార్గానికి ఇరువైపులా నిబంధనలను అతిక్రమించి రియల్​వ్యాపారులు అక్రమ పద్ధతిలో అనుమతులు పొంది నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో 32 ఫీట్ల వెడల్పుతో ప్రవహించే నాలా పూర్తిగా 10 ఫీట్ల వెడల్పు వరకే పరిమితం చేశారు. ఈ నాలా పూర్తిగా విధ్వంసం చేస్తే భారీ వర్షాలు వచ్చినప్పుడు నగరంలో కనిపించే దుస్థితి గ్రామీణ ప్రాంతాల్లో కనిపించక తప్పదు. భూ విలువ పెరిగిపోవడంతో పట్టాదారులైన యజమానులు వ్యవసాయం చేయలేక విక్రయాలకు పాల్పడుతున్నారు. దీంతో రాజకీయ పార్టీలను, ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు వివాదమైన కుంటలు, చెరువుల పక్కనుంచే భూములను తీసుకొని రియల్​ వ్యాపారులు అభివృద్ధి చేసి విక్రయాలు చేస్తున్నారు. రియల్​ వ్యాపారులు చేసే అక్రమాలకు కొంత మంది అధికారుల అండదండలు ఉండటంతో తప్పుడు పద్ధతిలో పయనిస్తున్నారు. అధికారులు, వ్యాపారులు చేసే నిర్వాకంతో అమాయక ప్రజలు మోసపోతున్నారు. అంతేకాకుండా ఎన్నో చెరువులను నింపి, రైతులకు, ప్రజలకు సాగు, తాగునీటిని సరఫరా చేసే నాలాను ధ్వంసం చేసే కుట్ర జరుగుతున్నది.

ఫిరంగి కాల్వకు చెక్..

షాబాద్‌లో ప్రారంభమైన ఫిరంగి​కాల్వ శంషాబాద్, గండిపేట్, రాజేంద్రనగర్​, సరూర్​నగర్, ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లోని చెరువులను నింపనున్నది. అలాంటి కాల్వను పూర్తిగా విధ్వంసం చేసే కుట్ర జరుగుతున్నదని సమాచారం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్​ మండలం సౌతంరాయి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 5, 6లలో 32 ఫీట్ల వెడల్పుతో ఇబ్రహీంపట్నం మండలం పెద్ద చెరువులోకి ప్రవహిస్తున్నది. ఈ నాలా పక్కనే అపర్ణ, సుమధుర కన్​స్ట్రక్షన్​ కంపెనీలు వాల్టా చట్టానికి, ఇరిగేషన్​ నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద విల్లాలు నిర్మాణం చేస్తున్నారు. అంతేకాకుండా ఫిరంగి కాల్వను వ్యాపారులు అనుకూలంగా మల్చుకొని డ్రైనేజీని వదిలివేయడం అలవాటైపోయింది. దీంతో ఎంతో కొంత ప్రవహించే నీరు కూడా కలుషితమవుతున్నది.

శాఖల మధ్య సమన్వయం లోపం..

ఇరిగేషన్, హెచ్ఎండీఏ, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో అక్రమాలు జరుగుతున్నాయి. ఒక సంస్థకు తెలియకుండా మరొక సంస్థ అధికారులు ఎన్వోసీలు ఇవ్వడం.. ఆ ధ్రువీకరణ పత్రంతో ప్రభుత్వ అనుమతులు తీసుకొని భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ శాఖల మధ్య సమన్వయం లేనంత వరకు ఈ తంతు ఎప్పటికీ ఆగదని మేధావులు చెబుతున్న విషయం. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తతో పనిచేస్తారా? లేదా? వేచిచూడాల్సిందే.

హైడ్రా పట్టించుకోవాలని వినతి..

అన్యాక్రాంతమవుతున్న ఫిరంగి నాలాను పూర్తిస్థాయిలో పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు, మేధావులు హైడ్రాను కోరుతున్నారు. చెరువులు, నాలాలను ధ్వంసం చేయడం ఎఫ్టీఎల్, బఫర్​ జోన్ విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా రియల్​ వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. స్థానికులు, స్వచ్ఛంధ సంస్థలు, మేధావులు ఇచ్చే వినతి పత్రాలను స్వీకరించి విచారణ చేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Next Story