అసంపూర్తిగా క్రీడా ప్రాంగణం పనులు..

by Sumithra |
అసంపూర్తిగా క్రీడా ప్రాంగణం పనులు..
X

దిశ, శంకర్పల్లి : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం అభాసుపాలవుతున్నది. అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగడం లేదు. శంకర్పల్లి మండలంలో 26 గ్రామపంచాయతీలకు 26 తెలంగాణ గ్రామీణ క్రీడాప్రాంగణాలు మంజూరయ్యాయి. ఇందులో 18 క్రీడా ప్రాంగణాలు పూర్తి కాగా అంతప్ప గూడ గ్రామంలోని క్రీడాప్రాంగణం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఆదరాబాదరాగా క్రీడా ప్రాంగణం బోర్డ్ పాతి అధికారులు చేతులు దులుపుకున్నారు. క్రీడాప్రాంగణాన్ని సరిగ్గా చదును చేయకుండానే రాళ్లతో కూడిన మట్టి పోసి వదిలేశారు. నీళ్లు పోసి చదును చేయాల్సి ఉన్నప్పటికీ చదునుచేయకుండానే అయిపోయింది అనిపించారు. అసంపూర్తిగా వదిలేసిన క్రీడా ప్రాంగణంలో క్రీడలు ఎలా ఆడాలో తెలియక యువకులు సతమతమవుతున్నారు. 2022 జూన్ రెండు నుంచి క్రీడా ప్రాంగణాల పనులు ప్రారంభమయ్యాయి.

ఇప్పటికే పూర్తి కావాల్సిన పనులు అధికారుల నిర్లక్ష్యంతో మూడు అడుగుల ముందుకు ఆరడుగులు వెనుకకు అన్న చందాన తయారైంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ తూతూ మంత్రంగా సాగడంతో పనులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. క్రీడాప్రాంగణం ఎకరా నుంచి అరఎకరం తీసుకొని అందులో వాలీబాల్ పోల్స్, నెట్ ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా యువకుల వ్యాయామం కోసం సింగిల్ బార్, డబుల్ బార్ ఇనుపస్తంబాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా పూర్తిస్థాయిలో అవేమి ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం నిధులైన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులు అధికారుల అలసత్వంతో పూర్తిగా నీరుగారి పోతున్నాయి. అధికారులు ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, పనులు వేగవంతం చేసి కేంద్ర ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలని గ్రామస్తులు, యువకులు కోరుతున్నారు.

Next Story

Most Viewed