HYDRA: చెరువులపై హైడ్రా నిఘా..! ఉమ్మడి రంగారెడ్డిలో 2 వేలకు పైగా కబ్జా

by Shiva |   ( Updated:2024-09-14 06:06:39.0  )
HYDRA: చెరువులపై హైడ్రా నిఘా..! ఉమ్మడి రంగారెడ్డిలో 2 వేలకు పైగా కబ్జా
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: భూ వ్యాపారులు అధికారులను ప్రభావితం చేసి చెరువులు, కుంటలను మాయం చేశారు. ప్రధానంగా రియల్‌ఎస్టేట్ పేరుతో చదును చేసి లేఅవుట్లు చేస్తున్నారు. కాగా పట్టా భూముల్లో కూడా చెరువులున్న గ్రామలున్నాయి. ఆ భూములను క్రయవిక్రయాలు చేసినప్పటికి కేవలం సాగుకు మాత్రమే వాడుకోవాలని, ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని రెవెన్యూ, ఇరిగేషన్ చట్టంలో ఉంటుంది. ఇవేవీ లెక్క చేయకుండా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు తాయిలాలకు ఆశపడి ఇష్టానుసారంగా ఎన్‌వోసీలు, అనుమతులు ఇవ్వడం విడ్డూరం. అధికారులు చేసిన తప్పిదాలతో రియల్ వ్యాపారులు సొమ్ము చేసుకుని సాధారణ ప్రజలను బలి పశువులు చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చెరువులు, కుంటలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్ధ నెల రోజులుగా గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైల్లు పరిగెత్తుతున్నాయి. కానీ రియల్ వ్యాపారులు చేసిన మోసాలకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదుల సంఖ్యలో చెరువులు పూర్తిగా మాయమైనట్లు తెలుస్తోంది.

గొలుసుకట్టు చెరువులకు మంగళం..

గొలుసుకట్టు చెరువులకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రాస్..ఇలాంటి చెరువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులదే, కానీ ప్రభుత్వాలు తమకు అనుకూల వ్యక్తులను ప్రోత్సహించి ఆక్రమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో నీళ్లు నిలిచే చెరువుల్లో ఇండ్లు దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలకు నీళ్లు వెళ్లే మార్గాలను సైతం మూసివేశారు. దీంతో వర్షాలు కురిసినప్పుడల్లా నగరమంతా జలమయమై రాకపోకలకు ఇబ్బందులు ఎర్పడుతున్నాయనే వాదనలు ఉన్నాయి. నగరవాసులకు నీటిని అందించే జంట జలాశయాల్లో సైతం నిర్మాణాలు చేపట్టారు. ఈ జలాశయాలను కాపాడుకునేందుకు జలాశయాల పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టకుండా ఉండేందుకు 111 జీవోను విడుదల చేసింది. అయినప్పటికి అధికారులను అడ్డంపెట్టుకుని కొందరు రాజకీయ నాయకులు నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తుంది. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలో మొత్తం 2,857 చెరువులున్నాయి. ఇందులో 50 శాతంపైగా చెరువులన్ని గొలుసుకట్టు చెరువులే కావడం విశేషం. ఇప్పుడు ఆ చెరువులకు మంగళంపాడినట్లు తెలుస్తోంది.

ఏరియల్ సర్వేతో గుర్తించిన చెరువులు..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కబ్జాలకు గురైన చెరువుల వివరాలను హైడ్రా సేకరించింది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల సాయంతో ఏరియల్‌ సర్వే రిపోర్టు రూపోందించినట్లు అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో చెరువుల సంఖ్య, ఒక్కొక్క చెరువు విస్తీర్ణం ఎంత, ప్రస్తుతం ఎంత విస్తీర్ణం ఉందనే అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే చెరువుల సంఖ్యపై నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని చెరువులు పూర్తిగా కనుమరుగైనట్లు హైడ్రా గుర్తించింది. క్షేత్రస్థాయిలోని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హైడ్రా సంప్రదించి నోట్ పైల్ పెట్టేందుకు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని చెరువులు 50 నుంచి 60 శాతం వరకు ఆక్రమణకు గురైనట్లు హైడ్రా రిపోర్టు వెల్లడించింది. ఇందుకు నిదర్శనం మహేశ్వరం మండల పరిధిలోని సర్థార్‌నగర్‌ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 2లో 8 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తుమ్మల చెరువు ఆనవాలు కనిపించకపోవడంతో ఇటీవల స్థానికులు మా తుమ్మ చెరువు కనిపించడం లేదు..వెతికిపెట్టండి అని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితే జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఇలా ఆక్రమణకు గురైన చెరువు శిఖం భూములల్లో వెలిసిన నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా పకడ్బందిగా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాలో రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో సుమారు 60 ఎకరాల చెరువు శిఖంలో నిర్మించిన నిర్మాణాలను తొలగించారు. అక్రమార్కుల చేతిలో ఉన్న వందల ఎకరాల శిఖం భూముల్లోని నిర్మాణలు కూల్చనున్నట్లు హైడ్రా వెల్లడిస్తోంది.

పాత మండలాల ప్రకారం కబ్జాకు గురైన చెరువుల సంఖ్య ఇలా..

మండలం ఓఆర్‌ఆర్‌ లోపల ఓఆర్‌ఆర్‌ బయట మొత్తం

హయత్‌నగర్‌ 30 54 84

ఇబ్రహీంపట్నం 0 56 56

కందుకూరు 0 118 118

మహేశ్వరం 0 84 84

మంచాల 0 4 4

మొయినాబాద్‌ 0 20 20

రాజేంద్రనగర్‌ 33 13 46

సరూర్‌‌నగర్‌ 6౦ 0 60

శేరిలింగంపల్లి 60 0 60

షాబాద్‌ 0 63 63

శంకర్‌పల్లి 0 10 10

యాచారం 0 13 13

శంషాబాద్‌ 15 56 71

Advertisement

Next Story

Most Viewed