మూల మలుపులు.. ప్రమాదానికి పిలుపులు

by Aamani |
మూల మలుపులు.. ప్రమాదానికి పిలుపులు
X

దిశ, కొత్తూరు : ఏ వాహన చోదకుడు అయినా సేఫ్ గా ఇంటికి చేరుకోవాలి అని కోరుకుంటూ ఉంటాడు. కానీ అనుకోని ప్రమాదం ఆ వ్యక్తి జీవితాన్ని ఛిద్రం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు..ఆ వ్యక్తి కుటుంబానికి ఆసరా ఎవరు ఉంటారు..! మండలం కేంద్రం నుండి కేశంపేట వరకు రెండు వరుసల రహదారి ఉంది. రహదారి నిర్మాణం పూర్తి అయ్యి నెలలు గడుస్తున్నది. అయినా ఇప్పటివరకు మూలమలుపుల వద్ద అధికారులు సూచిక బోర్డులను ఏర్పాటు చేయకపోవడం తో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పెంజర్ల, కొడిచెర్ల, ఎస్బి పల్లి, సిద్దాపూర్ ప్రాంతాల మీదుగా నిత్యం వందలాది వాహనాలు ప్రయాణం కొనసాగిస్తూ ఉంటాయి.

ఈ మధ్య కాలం లో ఈ ప్రాంతాలలో అనేక పరిశ్రమలు వెలిశాయి. దీంతో ఈ రహదారి రద్దీగా మారింది.ఈ రోడ్డులో అనేక మూలమలుపులు ఉండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా ఎస్ బీ పల్లి శివారులో ఉన్న జాండగూడెం మూలమలుపు వద్ద చెట్లు ఏపుగా పెరిగి ప్రమాదనికి కేరాఫ్ గా మారింది. వీలైనంత తొందరగా అధికారులు స్పందించి మూలమలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేసి రోడ్డు వెంబడి ఉన్న పిచ్చి చెట్లను తొలగించాలని వాహన చోదకులు కోరుతున్నారు.

నెలలు గడవక ముందే రోడ్డుకు బీటలు..

నిర్లక్ష్యం తో కూడిన నాణ్యత లేమితో రోడ్డు వేసిన కొన్ని నెలలకే బీటలు వారింది. దీంతో రోడ్డు నిర్మాణంపై ప్రజలు మండిపడుతున్నారు. రెండో విడతగా ఎస్పీ పల్లి శివారు నుంచి కేశంపేట వరకు కొన్ని రోజుల క్రితమే రోడ్డు నిర్మాణం జరిగింది. ఇంతలోనే రోడ్డుకు బీటలు వారడం ఏంటని ప్రజలు విమర్శిస్తున్నారు. నాణ్యత లోపించడం వల్లే తొందరగా మట్టి కుంగి రోడ్డుకు బీటలు వారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. రోజు రోజుకు బీటలు పెద్దగా అవుతుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story