రుణమాఫీ కోసం 2లక్షల మంది ఎదురుచూపులు..?

by Aamani |
రుణమాఫీ కోసం 2లక్షల మంది ఎదురుచూపులు..?
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్​ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీకి అనుకూలంగా మూడు విడతల్లో రుణమాఫీ చేసింది. అయితే రూ.2 లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ చేయడంలో జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలో రూ.2లక్షల రుణమాఫీ కానీ వాళ్లు సుమారుగా లక్షల మంది రైతులకు రూ.2వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కోత్త రుణాల కోసం బ్యాంకుల చూట్టు చక్కర్లు కొడుతున్నారు. అయితే పాత రుణాలు మాఫీ కాకపోతే కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితితో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి సీజన్ పూర్తయినప్పటికీ రుణాలు మాఫీ కాక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.

ఆశలతో ఎదురుచూపు...?

రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో 3లక్షల 50 వేల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరందరిని మూడు విడతల్లో రుణాలు మాఫీ చేసేందుకు ముందుగానే లబ్ధిదారులను గుర్తించింది. మొదటి విడుత రూ.లక్ష, రెండో విడత రూ.లక్ష 50 వేలు, మూడో విడత రూ.2 లక్షల చొప్పున మాఫీ చేసింది. అయితే మొదటి, రెండవ విడతల్లో జరిగిన రుణామాఫీలో ఏలాంటి జాప్యం లేకుండా పూర్తి చేశారు. అయితే మూడో విడత రుణామాఫీలో రూ.2లక్షలు అయ్యేందుకు అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. అయినప్పటికి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో ఇంకా 2లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉంది. రూ.2లక్షల రుణాలు తీసుకున్న వాళ్లు 2లక్షల మందికి రూ.2వేల కోట్లు మాఫీ కావాలని అధికారులు వివరిస్తున్నారు.

అప్పులు తెచ్చి చెల్లింపు...

రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు ఒకే కుటుంబంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది. అందుకు అనుగుణంగా రైతులు రూ.2 లక్షలకు పైన ఉన్న రుణాలను బ్యాంకుల్లో చెల్లించాలని వ్యవసాయ అధికారులు సూచించారు. అందుకు అనుగుణంగా రైతులు అప్పోసప్పో చేసి రూ.2లక్షలు పైన ఉన్న నగదును బ్యాంకుల్లో చెల్లించారు. అయినప్పటికి రుణమాఫీ విషయంలో సమస్య అలాగే కొనసాగుతుంది. కొంత మంది రైతులు రూ.2 లక్షలకు పైగా రుణాలు వేరు వేరు బ్యాంకుల్లో తీసుకున్నారు. మరికొంత మంది ప్రాథమిక సహకార బ్యాంకు ద్వారా తీసుకున్నారు. అయితే రుణాలు తీసుకునేటప్పుడు ఆధార్​, రేషన్​ కార్డు, ఇంటి పేరు అడ్రస్​ వివరాలు ఆన్​లైన్​లో తప్పుగా ఎంటర్​ చేసినట్లు తెలుస్తోంది. దాంతోనే రుణాల చెల్లింపులో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. మరికోంత మంది రైతులు అన్ని విధాల నిబంధనలకు లోబడి ఉన్నప్పటికి రూ.2లక్షల రుణం మాఫీ కావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతుల ఆందోళనకు చెక్​ పెట్టాలని కోరుతున్నారు.

ఇంకా 2193 మందికి రుణమాఫీ కాలేదు...: విద్యాధరి, మండల వ్యవసాయాధికారి, ఇబ్రహింపట్నం

రూ.2లక్షల రుణమాఫీకి 5103 మంది అర్హులు... ఇందులో 2910 మంది రైతులకు రెండు లక్షల చొప్పున రూ.22.36కోట్లు మాఫీ అయింది. మిగిలిన 2193 మంది రైతుల రుణమాఫీ పెండింగ్​ ఉంది. ఇందులో 39 మంది రైతులు మరణించారు. అయితే పెండింగ్​లో ఉన్న రైతుల ఆధార్​ నెంబర్లు వేరు వేరుగా ఉండటం తో జాప్యం జరుగుతుంది.

ఆన్​లైన్​లో వివరాలు తప్పుగా నమోదు: జమ్మ బీరప్ప, ఆదిబట్ల రైతు

పంట రుణం రెండు బ్యాంకుల్లో తీసుకున్నాను. ఎస్బీఐలో రూ.75వేలు, మంగల్​పల్లి సొసైటీ బ్యాంక్​లో రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1,25,000 తీసుకున్నాను. అయితే రెండో దఫాలోనే రుణమాఫీ కావాలి... కానీ ఇప్పటివరకు కాలేదు. ఎందుకని వ్యవసాయ అధికారులను సంప్రదిస్తే ఆధార్​ నెంబరు రెండు బ్యాంకుల్లో వెరు వెరుగా ఉన్నాయి. దీంతో రుణమాఫీ అయ్యేందుకు జాప్యం జరుగుతుందని అధికారులు వివరించారు. ఏ బ్యాంకులైతే ఆధార్​ నెంబర్​ తప్పుగా పడిందో అక్కడ సరిచేసుకోవాలని తెలిపారు. కానీ ఆ బ్యాంకు వాళ్లు మా చేతిలో ఏమీ ఉండదు... అంతా వ్యవసాయాధికారి కార్యాలయమని తిప్పుతున్నారు. రుణమాఫీ అవుతుందో లేదో అనే అనుమానం ఉంది.

Advertisement

Next Story

Most Viewed