ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ వెంటనే విడుదల చేయాలి: మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

by Shiva |
ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ వెంటనే విడుదల చేయాలి: మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గతేడాదికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు కోరారు. విద్యాశాఖ ఇచ్చిన అసంపూర్తి వివరణపై సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ ప్రాథమిక విద్యను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని, పాఠశాలల నిర్వహణ గాలికి వదిలేయడం వల్ల ఉపాధ్యాయులు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే, అసలు సమస్యలే లేవు అన్నట్లు విద్యాశాఖ ప్రకటించడం సరికాదన్నారు. సమస్యలను పరిష్కరించకుండా, వాస్తవాలను పక్కనబెట్టడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నష్టం జరుగుతుందని మండిపడ్డారు. ఇవే సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయని నిర్దారించేటందుకు, సిద్దిపేట నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ సమస్యల పూర్తి వివరాలను మీ దృష్టికి తెస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కారం చూపాలని కోరారు.

కుక్ కం హెల్పర్ లకు చెల్లించే 3వేల గౌరవ వేతనం గతేడాది డిసెంబర్ వరకే వచ్చాయని, 2024 జనవరి, ఫ్రిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్ లకు సంబంధించిన 5నెలల వేతనాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్నారు. 9వ తరగతి నుంచి పదో తరగతి వరకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు జనవరి 2024 వరకు మాత్రమే వచ్చాయని, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్ కు సంబంధించిన 4 నెలల బిల్లులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు ఏప్రిల్ 2024 వరకు మాత్రమే వచ్చాయని, జూన్ నెల బిల్లులు ఇంకా పెండింగ్ లోనే ఉందని, కోడిగుడ్డు బిల్లులు జనవరి 2024 వరకు మాత్రమే వచ్చాయని, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్ కు సంబంధించి 4 నెలల బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయని వెల్లడించారు.

సర్వశిక్ష అభియాన్, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ల వేతనాలు మే 2024 వరకే వచ్చాయని, మిగతా నెలలవి పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. గతంలో పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణ గ్రామపంచాయతీల ద్వారా జరిగేది. కానీ, ఈ బాధ్యతను అమ్మ కమిటీలకు అప్పగించి నిర్వహిస్తామని చేసిన ప్రభుత్వ ప్రకటన మాటలకే పరిమితమైందని, దీంతో పారిశుధ్యనిర్వహణ ప్రశ్నార్థకమైందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం, తక్షణమే ప్రతి పాఠశాలకు నెలకు రూ.10వేలు విడుదల చేసి, పారిశుధ్య నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు.

పేద విద్యార్థుల ఆకలి తీర్చే సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని తిరిగి పునర్ ప్రారంభించాలని కోరారు. పాఠశాలలకు ఉచిత కరెంట్ అందిస్తామని స్వయంగా హామీ ఇచ్చారని,. ఇది కూడా మాటలకే పరిమితమైందని తెలిపారు. అధికారిక ఉత్తర్వులు లేకపోవడం వల్ల పాఠశాలల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం, తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్జీటీ నుంచి స్కూల్ అసెస్టెంట్లుగా ప్రమోషన్లు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో సుమారు 9వేల ఖాళీలు ఏర్పడ్డాయని, డీఎస్సీ రిక్రూట్ర్మెంట్ పూర్తి అయ్యే లోగా, పిల్లలకు విద్యాబోధన జరిగేలా విద్యావాలంటీర్లను నియమించాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed