ప్రాజెక్టుల వద్దకు పర్యాటకులను అనుమతించరాదు

by Sridhar Babu |
ప్రాజెక్టుల వద్దకు పర్యాటకులను అనుమతించరాదు
X

దిశ, నాగిరెడ్డిపేట్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రాజెక్టులు, చెరువులు, నదులు పూర్తిస్థాయిలో నిండి ఉన్నందున ప్రాజెక్టుల వద్దకు పర్యాటకులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశించారు. సోమవారం మండలంలోని పోచారం ప్రాజెక్టును ఎల్లారెడ్డి డివిజన్ పోలీస్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాను వలన వర్ష బీభత్సం కొనసాగుతున్నందున వాగులు, వంకల వద్దకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఉధృతంగా ప్రవహించే నీళ్లవద్దకు వెళ్లి సెల్ఫీలు కానీ వీడియోలు కానీ తీయరాదని, అనవసరంగా ఎట్టి పరిస్థితులలో బయటకు వెళ్లరాదని సూచించారు. పోచారం డ్యామ్ పైనుండి నీరు ఉధృతంగా పొంగిపొర్లుతున్నందున మంజీరా నది పరీవాహక ప్రాంత గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలని, అదేవిధంగా పశువుల కాపరులు, పంట పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పాత ఇళ్లలో నివాసం ఉంటున్న కుటుంబాలను అవసరమైన పునరావాస కేంద్రాలలోకి వెంటనే తరలించాలని స్థానిక పోలీస్ సిబ్బందికి సూచించారు. జిల్లా ఎస్పీ వెంట ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, వలయాధికారి రవీందర్ నాయక్, స్థానిక ఎస్సై మల్లారెడ్డి, ఇరిగేషన్ ఏఈ శ్రీకాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ యాదగిరి. పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed