దొంగతనానికి వచ్చిన దొంగ ఈజీగా దొరికిపోయాడు

by Naveena |
దొంగతనానికి వచ్చిన దొంగ ఈజీగా దొరికిపోయాడు
X

దిశ భిక్కనూరు : స్నేహితుడి అవసరం తీర్చేందుకు..పెన్షన్ డబ్బులు కాజేయడం కోసం పక్కా ప్లాన్ వేయగా..చివరి నిమిషంలో వ్యూహం బెడిసి కొట్టిన ఘటన భిక్కనూరు చోటు చేసుకుంది. దీంతో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సస్పెండ్ చేసి..స్నేహితుడితో పాటు పోస్ట్ మాస్టర్ బీబీపేట పోలీసులు అదుపులోకి తీలసుకున్నారు. వివరాల్లోకి వెళితే... బీబీపేట పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఐదు బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు ఉండగా..దాంట్లో తుజల్ పూర్ గ్రామ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ దేవి సోత్ బిక్యా ఐదు నెలల క్రితం సస్పెండ్ అయ్యాడు. దీంతో ఈ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ను ఇస్సాన్ నగర్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బట్టు అనిల్ కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే చేయూత, ఆసరా పెన్షన్ల పథకం కింద తుజాల్ పూర్, ఇస్సాన్ నగర్ గ్రామాలకు 10 లక్షల రూపాయల నగదు వచ్చింది. అయితే ఈ డబ్బుల ను సస్పెండ్ అయిన తుజాల్ పూర్ బిక్యా రూమ్ లోకి తీసుకెళ్లి..అతని చెస్ట్ బాక్సులో దాచిపెట్టి తాళం వేశాడు. ఈ విషయాన్ని గమనించిన సస్పెండ్ అయిన బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బిక్యా తన స్నేహితుడు బాకీ అడిగాడన్న విషయాన్ని మనసులో పెట్టుకొని..10 లక్షల రూపాయలు కాజేసేందుకు పక్కా ప్లాన్ రూపొందించాడు. దాంట్లో భాగంగా వకాడత్ సురేష్ అనే స్నేహితుడిని బీబీపేటకు రప్పించాడు. అదే రోజు సాయంత్రం మల్కాపూర్, జనగామ, యాడారం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లతో కలసి కామారెడ్డి లో సినిమా చూసేందుకు ప్లాన్ వేశాడు. సినిమా చూసేందుకు వెళ్లిన ఐదుగురిలో కొద్దిసేపటికి బిక్యా స్నేహితుడు సురేష్ సినిమా మధ్యలో నుంచి వచ్చి, రాత్రి 8 గంటల వరకు బీబీపేటకు చేరుకున్నాడు. డబ్బు దాచిన గది తో పాటు, తాళం చెవిలు కూడా ఎక్కడ ఉన్నాయో ఫోన్ లో బిక్యా స్నేహితుడికి చెప్పడంతో.. దాచిన పది లక్షల రూపాయల బ్యాగును తీసుకొని రాత్రి 11 గంటల ప్రాంతంలో సురేష్ ఇస్సాన్ నగర్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా..పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అతనిని ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అంటూ ప్రశ్నిస్తూనే, ఆ బ్యాగులో ఏమున్నాయని బెదిరించారు. దీంతో సురేష్ భయపడిపోయి తన స్నేహితుడి డబ్బులు లక్షో రెండు లక్షలు ఉన్నాయని చెప్పగా..అనుమానం వచ్చిన పోలీసులు వాహనం ఎక్కించుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. పెట్రోలింగ్ వాహనం కొద్దిగా ఆలస్యం అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యేవాడు. ప్లాన్ జస్ట్ మిస్ కావడంతో..సీన్ రివర్స్ అయిపోయి ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ మేరకు బీబీపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బికియా, అతడి స్నేహితుడు సురేష్ నుంచి 10 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు భిక్కనూరు సీఐ సంపత్ కుమార్ వివరించారు.

Next Story